జగన్ దీక్ష ఆగదు, ప్రభుత్వానిదే బాధ్యత: బాబును ఎకేసిన బొత్స
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన గుంటూరులో తలపెట్టిన తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు అనుమతి నిరాకరించడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగన్ దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో రాజీ పడ్డారని ఆయన బుధవారం మడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.
స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభం కోసం, ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదాను వదులుకునేందుకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఫరవా లేదు, ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజల మనోభావాలను చాటేందుకే జగన్ దీక్షకు దిగుతున్నారని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాకు వ్యతిరేకమా, వైయస్ కుటుంబానికి వ్యతిరేకమా, జగన్ దీక్షను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు పార్టీకి వ్యతిరేకమా అని ఆయన అడిగారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా దీక్షకు అనుమతి ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించాలని దీక్ష ఆగదని, సంభవించే పరిణామాలకు ప్రభుత్వ మే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు కలుగుతుందని, జగన్కు జరిగే ప్రయోజనం ఏమీ లేదని ఆయన అన్నారు. కుళ్లుతో, దుర్బుద్ధితో జగన్ దీక్షను అపడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు జరుగుతున్న పరిణామాలను అర్తం చేసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి మేలు చేస్తామని ఎన్నికల సమయంలో మోడీ, చంద్రబాబు ఒకే వేదిక మీది నుంచి హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం జగన్ దీక్షను తలపెట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications