హెరిటేజ్ పెరుగు.. హెరిటేజ్ నెయ్యి: తనకు లబ్ధి చేకురేలా చంద్రబాబు చేస్తున్నారా?
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు హోదా రానే రాదన్నట్లు చంద్రబాబు మాట్లాడడం భావ్యమేనా..? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే తామేం చేస్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీతో చంద్రబాబు ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల వల్ల కృష్ణా గోదావరి బేసిన్లు ఏడారిగా మారుతుందని చెప్పుకొచ్చారు.
ఇక రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆ మాత్రం సోయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేకుంటే ఎలా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారు పట్టించుకోకుంటే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు.
కేంద్రంపై ప్రభుత్వంపై కొట్లాడి హక్కులు సాధించుకురావాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కొన్ని పత్రికలు చంద్రబాబు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని రాస్తున్నాయని.. ఆ పత్రికలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కాదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం తరుపున ఏం చేసినా తనకే లబ్ధిచేకూరేలా.. హెరిటేజ్ పెరుగు.. హెరిటేజ్ నెయ్యి.. చంద్రన్న పథకాలు.. ఇలా చూస్తూ వెళుతుంటే ఏవగింపు, ఎబ్బేట్టు కలుగుతుందని చెప్పారు. ఎంతసేపు తనకు ఎలాంటి లాభం చేకూరుతుందా? అని ఆలోచించడం తప్ప చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కటీ చేయడం లేదని ధ్వజమెత్తారు.
ఇలాంటి పాలన ఎవరైనా చేస్తారా? అని నిలదీశారు. 'చంద్రబాబు స్వంత ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తున్నారు.. కానీ, రాష్ట్రప్రయోజనాల కోసం కాద'ని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బొత్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యపై ఎలాంటి కార్యచరణ వెలువరిస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.