ఆ ఉద్యోగులకు నోటీసులు- సీఎం ఇల్లు ముట్టడిస్తే ఊరుకుంటామా ? మిలియన్ మార్చ్ పై బొత్స
ఏపీలో సీపీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న ఉద్యోగులు నిర్వహించనున్న మిలియన్ మార్చ్ వ్యవహారం కలకలం రేపుతోంది. మిలియన్ మార్చ్ కు ఉద్యోగులు వెళ్లకుండా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉద్యోగులతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తోంది.
సీపీఎస్ రద్దు కోరుతూ సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు ప్లాన్ చేస్తున్న ఉద్యోగులపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించడమేంటని ఉద్యోగుల్ని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వ బాధ్యతని ఆయన అన్నారు. నిన్నటి రోజున చర్చలు జరపలేదని, విషయం ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే వారితో సమావేశమయ్యామని బొత్స తెలిపారు.
Recommended Video
సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పడం వాస్తవమని, కొత్త స్కీమ్ ప్రొవైడ్ చేశామని, దాని మీద చర్చ జరుగుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానం ఉద్యోగులకు ఆమోదయోగ్యమైనది కాదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా ఆలోచన చేస్తున్నామని బొత్స వెల్లడించారు. దయచేసి ఉద్యోగులు..సమస్యను అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో వారు కూడా భాగస్వాములన్నారు. మిలియన్ మార్చ్ సంగతి తనకు తెలియదన్నారు. ఉద్యోగ సంఘాలు వారి సమస్యల పై పోరాటం చేసే హక్కుందని, గత ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యి ఉంటే అలాంటి ఉద్యోగులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని బొత్స వెల్లడించారు. సీఎం ముట్టడికి పిలుపునిస్తే ఊరుకుంటామా అని బొత్స ప్రశ్నించారు. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అన్ని శాఖల్లో అమలుచేస్తామని బొత్స మరోసారి చెప్పారు.