అవినీతి రహిత పాలన అనేది పచ్చి బూతు: చంద్రబాబుపై బొత్స ఫైర్..
కేంద్రం నుంచి వచ్చాయని చెప్పిన రూ.1.75లక్షల కోట్లు ఎక్కడికెళ్లాయో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. అవినీతి రహిత పాలన అందించడమంటే.. ఎక్కడికెక్కడ కాకి లెక్కలు చెప్పడమేనా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వ తీరుపై వైసీపీ నేత బొత్స నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడి అవినీతి జరుగుతుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పడం విడ్డూరం అన్నారు. అవినీతి రహిత పాలన అనేది పచ్చి బూతు అని ఆయన ధ్వజమెత్తారు.
శనివారం హైదరాబాద్లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంపై విరుచుకుపడ్డ ఆయన.. ప్రస్తుతం టీడీపీ మహానాడు జరుగుతున్న విశాఖలోనే చంద్రబాబు కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్న సంగతి గుర్తుచేశారు. రుణమాఫీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ధరల స్థిరీకరణ తదితర నిధులన్ని ఎటు మళ్లుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
కేంద్రం నుంచి వచ్చాయని చెప్పిన రూ.1.75లక్షల కోట్లు ఎక్కడికెళ్లాయో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. అవినీతి రహిత పాలన అందించడమంటే.. ఎక్కడికెక్కడ కాకి లెక్కలు చెప్పడమేనా? అని ప్రశ్నించారు. ఇక వరుసగా జరుగుతున్న రాజకీయ హత్యల గురించి బొత్స ప్రస్తావించారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని.. వాటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీని హెచ్చరించారు.
విశాఖలో జరుగుతున్న మహానాడులో ఆత్మస్తుతి, పరనింద తప్పితే చంద్రబాబు ఏ ఒక్క నిజం గురించి మాట్లాడలేదన్నారు. మహానాడు వేదిక నుంచి ప్రజలకు నిజాలు తెలియజేస్తే మంచిదని హితవు పలికారు.