పవన్ కు గోల్డెన్ ఛాన్స్ - పిఠాపురంలో 50 వేల కోట్ల ప్రాజెక్టు, కానీ..!!
ఏపీకి భారీ ప్రాజెక్టు రాబోతుంది. బిపీసీఎల్ రిఫైనరీ కొత్త ప్రాజెక్ట్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. నిర్ణయం దాదాపు ఖరార్ అయినట్లు తెలుస్తుంది. కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తే పిఠాపురంకు భారీ ప్రాజెక్టు ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో కొత్త సంస్థ
కేంద్ర పెట్రోలియం సంస్థ బీపీసీఎల్ సుమారు 50 వేల కోట్ల తో ప్రతిపాదించిన రిఫైనరీ ఆంధ్ర ప్రదేశ్ కు దక్కటం దాదాపు ఖాయమైంది. ఈ రిఫైనరీ కోసం గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ పోటీపడ్డాయి. అయితే ఈ ప్రాజెక్టును ఏపీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 50వేల కోట్లతో ఏర్పాటు అయ్యే ఈ రిఫైనరీ ద్వారా మరికొన్ని చిన్న తరహా పరిశ్రమలు సైతం ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తొలుత ఈ రిఫైనరీని మచిలీపట్నం పరిధిలో ఏర్పాటుపై చర్చలు జరిగాయి. అయితే తాజాగా పిఠాపురానికి ఈ రిఫైనరీ కేటాయించాలననే ప్రతిపాదనలు వస్తున్నాయి.

పిఠాపురం పై చర్చ
దీని పైన ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాకినాడ పరిసరాల్లోని పిఠాపురం నియోజకవర్గంలోని 2004లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేశారు దాదాపు 12,500 ఎకరాల్లో దీనిని కేటాయించారు. 20 ఏళ్ల కాలంగా ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు మధ్యలో ఒకటి రెండు చిన్నచిన్న పరిశ్రమలు వచ్చినా తక్కువ కాలంలోనే వాటిని మూసేశారు. రైతుల నుంచి సేకరించిన 12,500 ఎకరాల భూమి నిరుపయోగంగా మిగిలింది. ఈ ప్రాంతాన్ని పెట్రోలియం ఆధారిత పెట్రోల్ ఉత్పత్తుల ఆర్థిక మండలిగా కూడా గతంలో ప్రకటించారు. కానీ ఒక్క పెట్టుబడి కూడా ఇప్పటివరకు రాలేదు.

పవన్ ప్రయత్నిస్తే
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ కళ్యాణ్ తాను గెలిచిన తర్వాత సెజ్ లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో తను పరపతిని ఉపయోగించి పరిశ్రమల్ని రప్పిస్తే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పిఠాపురంలో పర్యటించిన సమయంలోను ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
అయితే ఇప్పుడు ఏపీకి ఖాయమైందని చెబుతున్న బీపీసీఎల్ ను పిఠాపురం పరిధిలోని సెజ్ లో ఏర్పాటు చేస్తే ఆ భూములకు ఉపయోగం కలగడంతో పాటుగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ప్రధానితో నేరుగా పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన సంప్రదిస్తే అధికారికంగా నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. మరి పవన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా.. పిఠాపురం కి ఈ రిఫైనరీ దక్కుతుందా అనేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత రానంది.












Click it and Unblock the Notifications