టెక్కీ బ్రెయిన్ డెడ్: ఆరుగురికి ప్రాణదానం చేసిన విద్యార్థి
విజయవాడ: బ్రెయిన్డెడ్ అయిన బిటెక్ విద్యార్థి ఒకరు అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేసి చావుబతుకుల్లో ఉన్న మరో ఆరుగురికి ప్రాణదానం చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని విజయవాడలో శనివారం జరిగింది.
ఆంధ్ర ఆసుపత్రిలో పని చేస్తున్న విజయలక్ష్మి.. ఆమె భర్త శివరామప్రసాద్ బ్యాంక్ ఉద్యోగి. వీరి కొడుకు సుధీర్ తేలప్రోలులోని ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవలే బిటెక్ పూర్తి చేశాడు. ఓ సర్టిఫికేట్ కోసం ఈ ఏడాది మార్చి 3వ తేదీన కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
తల్లిదండ్రులు సుధీర్ను చికిత్స కోసం వెంటనే ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అత్యవసర వైద్యాన్ని అందించినప్పటికీ తలకు తగిలిన బలమైన గాయం వలన బ్రెయిన్డెడ్ అయినట్లు చెప్పారు.
అతని ప్రాణం పోతున్నందున అవయవదానం చేయటం వలన మరెందరికో జీవం పోయవచ్చంటూ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి సూచించారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించారు.
సుధీర్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లను తొలగించారు. గుండె, ఊపిరితిత్తులను ప్రత్యేక విమానం ద్వారా చెన్నైలోని ఫోర్టీస్ ఆసుపత్రికి తరలించారు. కిడ్నీలలో ఒకదానిని విజయవాడలోని అరుణ్ కిడ్నీ సెంటర్కు, మరోదాన్ని ఆయుష్ ఆసుపత్రికి, కాలేయాన్ని విశాఖలోని కేర్ ఆసుపత్రికి, కళ్లను స్థానిక వాసన్ ఐ కేర్కు పంపించారు.