కాళ్ల పారణి ఆరక ముందే పెళ్లింట విషాదం: రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి
విశాఖపట్నం: పెళ్లి జరిగి నాలుగు వారాలు కూడా పూర్తి కాలేదు. ఇంటి ముందు వేసిన పందిళ్లు కూడా తీయలేదు. వధువు కాళ్ల పారాణి ఆరలేదు. ఇంతలో పెళ్లింట ఊహించని విషాదం చోటు చేసుకుంది. మృత్యువు నవ వధువుని కబలించింది. నక్కపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు గ్రామాల్లో విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే జిల్లాలోని ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేటకు చెందిన చొప్పా మంగరాజుకు, నక్కపల్లి మండలం జానకయ్యపేటకు చెందిన వరలక్ష్మితో ఆగస్టు 25న కృష్ణాష్టమి రోజున వివాహం జరిగింది. కాగా వరలక్ష్మి నక్కపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతోంది. రోజూ లాగే గురువరం కూడా ఆమె కాలేజీకి వెళ్లింది.
మంగరాజు (30) తన సోదరుడైన గోవింద్ (33)తో కలిసి ద్విచక్ర వాహనంపై తుని బయల్దేరాడు. నక్కపల్లి దాటిన తరువాత కూడలిలో వీరి వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్యాంకర్ ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న మంగరాజు అక్కడికక్కడే చనిపోగా, అతని సోదరుడు గోవింద్ తీవ్రంగా గాయపడ్డాడు.
అతని కాలు, చేయి విరిగిపోవడంతో నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్లో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. తన భర్త ప్రమాదంలో మరణించాడన్న వార్త తెలియడంతో వరలక్ష్మి భోరున విలపిస్తూ ఆసుపత్రికి చేరుకుంది.
మార్చురీ వద్ద కుటుంబసభ్యులంతా గుమిగూడి ఉండడంతో కుప్పకూలిపోయింది. ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏం పాపం చేశానంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే అక్కడున్న వారు కూడా కంటతడి పెట్టారు. కాగా మంగరాజు, గోవింద్ ఇద్దరూ విశాఖకు సమీపంలోని హెటెరోలో పనిచేస్తున్నారు.
మంగరాజు మరణించాడని తెలుసుకున్న సహ ఉద్యోగులు ఆవేదన చెందారు. ఈ రోడ్డు ప్రమాద సంఘటన జానకయ్యపేట, గుర్రాజుపేట గ్రామాల్లో విషాదాన్ని నింపింది.