ఏపీలో పోటీకి సిద్ధమైన బీఆర్ఎస్?
భారతీయ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో పోటీకి సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం దగ్గర ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తికాకుండానే ముందుగా కార్యాచరణ ప్రణాళికను ఆ పార్టీ సిద్ధం చేసుకుంటోంది. ఏపీకి కూడా కేసీఆర్ నాయకత్వం కావాలని గతంలో కొందరు నాయకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తిరుపతి పర్యటనకు ఆయనకు ఏ రీతిలో స్వాగతం పలికారో మనందరం చూసిందే. జాతీయపార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరుశాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ వర్తించాలంటే తెలంగాణతోపాటు ఏపీలోను, తెలుగువారున్న ఇతర రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోను పోటీచేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
తాజాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అధ్యక్షుడు పెల్లకూరు సురేంద్రరెడ్డి హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దేశంలో మోడీని ఎదురించే మొనగాడు కసీఆర్ ఒక్కరేనని, ఢిల్లీలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తే సత్తా ఒక్క కేసీఆర్కే ఉందన్నారు. కేంద్రం చూపిస్తున్న వివక్షా పూరిత రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కేసీఆర్ లాంటివారి అవసరం ఉందని సరేంద్రరెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వాయిస్ ఢిల్లీలో బలంగా వినపడాలంటే కేసీఆర్ ఒక్కరివల్లే సాధ్యమని, ప్రజలు కూడా అదే నమ్ముతున్నారని, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి కూడా బీఆర్ఎస్తో కలిసి పోటీచేస్తుందని చెప్పారు. మున్ముందు కూడా ఏపీ నుంచి ఇలాంటి నేతలు వచ్చి హైదరాబాద్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఏపీకి కేసీఆర్ నాయకత్వం కావాలని అడిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.