సత్య నాదెళ్లపై వ్యాఖ్య, చరిత్ర చెప్పి ఇరుక్కున్న బాబు: దులిపేసిన బుగ్గన
విజయవాడ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉద్యోగం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదమని వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు. ఐటీ పైన చంద్రబాబు వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు.
1992లోనే సత్య నాదేళ్ల మైక్రోసాఫ్టులో జాయిన్ అయ్యారని, కానీ బాబు మాత్రం తన వల్లే సత్య నాదెళ్ల ఐటీ చదివారని చెబుతున్నారని, ఆయన తీరు చూస్తే నవ్వొస్తుందన్నారు. 1995లో చంద్రబాబు సీఎం అయితే, సత్య అంతకుముందే అమెరికాలో స్థిరపడ్డారన్నారు. 1992లోనే ఆయన సన్ మైక్రో సిస్టమ్స్లో చేరారన్నారు.
మరి చంద్రబాబు నుంచి ఆయన స్ఫూర్తి ఎక్కడ పొందినట్లు అని ప్రశ్నించారు. ప్రపంచానికే ఐటీని నేర్పానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇక యుగంధర్ గారు 86 నుంచి 88 వరకు ఏపీలో పని చేశారని, చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

ఆయన దగ్గర యుగంధర్ గారు ఎప్పుడు పని చేశారో చెప్పాలన్నారు. చెప్పేందుకైనా నమ్మశక్యం అయ్యే మాటలు ఉండాలన్నారు. చంద్రబాబు పాలనలో హైదరాబాద్ కంటే బెంగళురులోనే ఐటీ ఎక్కువగా అభివృద్ధి చెందిందని చెప్పారు. అందరూ తనను చూసే స్ఫూర్తి పొందారని చెప్పుకునే బాబుకు.. మరి అలా ఆదర్సంగా తీసుకున్నామని ఎవరూ ఎందుకు చెప్పడం లేదన్నారు.
సత్యచ నాదెళ్ల కూడా చంద్రబాబు నుంచే స్ఫూర్తి పొందానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. అంతెందుకు ప్రపంచ స్ఫూర్తిదాతగా నిలిచిన చంద్రబాబు నుంచి మరి ఆయన తనయుడు లోకేష్ ఎందుకు ఇన్స్పైర్ కాలేకపోయారని ప్రశ్నించారు.
హైదరాబాద్ గురించి మాట్లాడితే నేనే కటడ్టానని చంద్రబాబు గొప్పలు చెబుతారని, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తక్షణమే సత్య నాదెళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు మాటలు చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావట్లేదన్నారు.












Click it and Unblock the Notifications