బీజేపీకి బంపర్ ఛాన్స్-వార్ ఆహ్వానిస్తున్న జగన్-రివర్స్ అటాక్ తో 2019 రిపీట్ ?
తన కోపమే తన శత్రువు అన్న సామెత ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి అతికినట్లు సరిపోయేలా కనిపిస్తోంది. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందన్న కోపంతో బీజేపీపై వైసీపీ ప్రారంభించిన కౌంటర్ అటాక్.. ఇప్పుడు ఆ పార్టీకి నష్టం చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు పలు సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఇప్పుడు బీజేపీతో మిత్రభేధం సమస్యలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ ఎదుగుదలకు రూట్ క్లియర్ చేస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

జగన్, బీజేపీ స్నేహం
2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం తర్వాత కేంద్రంలో మళ్లీ గెలిచిన బీజేపీతో స్నేహం వైఎస్ జగన్ కు అనివార్యంగా మారింది. ఓవైపు సీబీఐ కేసులు, మరోవైపు నానాటికీ క్షీణిస్తున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి, పోలవరం వంటి హామీలు జగన్ చేతుల్ని కట్టిపాడేశాయి. దీంతో ప్రత్యేక హోదా సహా విభజన హామీలేవీ అమలు చేయకపోయినా రెండేళ్లుగా జగన్ బీజేపీతో స్నేహగీతం ఆలాపిస్తూనే ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీల్ని పదే పదే అడగటం మినహా చేసేదీమీ లేదంటూ స్వయంగా వైఎస్ జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలతోనే ఈ ఐదేళ్లూ ఎలా ఉండబోతున్నాయో అందరికీ అర్ధమైపోయింది. ఇప్పుడు బీజేపీపై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో భవిష్యత్తు ఎలా మారబోతోందో కూడా స్పష్టమవుతూనే ఉంది.

జగన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి
రాష్ట్రంలో భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్... వాటిని తూచా తప్పకుండా అమలు చేసే క్రమంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై ఆధారపడకతప్పడం లేదు. అదే సమయంలో జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఉన్న సీబీఐ అక్రమాస్తుల కేసులు, వైఎస్ వివేకా హత్య కేసు సహా ఇతర కష్టాలు ఉండనే ఉన్నాయి. దీంతో అనివార్యంగా ఎన్డీయే సర్కార్ ఏమాత్రం సహకరించకపోయినా జగన్ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అదే్ సమయంలో ఇదే అదనుగా రాష్ట్ర బీజేపీ నేతలు స్వరం పెంచడం మొదలుపెట్టారు. దీంతో జగన్ పై ఒత్తిడి నానాటికీ పెరిగిపోతోంది. కాబట్టి జగన్ ఇక రూటు మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎదురుదాడికి సిద్ధమైన జగన్
ఓవైపు కేంద్రం నుంచి వీసమెత్తు సహకారం లేకపోవడం, అప్పుల విషయంలోనూ తనను ఇరుకున పెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నేతలు మత పరమైన విషయాలు తెరపైకి తెచ్చి ఇరుకున పెడుతుండటంతో జగన్ సహనం కోల్పోతున్నారు. దీంతో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. జగన్ నుంచి ఆదేశాలు రావడంతో ఇక మంత్రులు చెలరేగిపోవడం మొదలుపెట్టేశారు దీంతో ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో అనుసరిస్తున్న వైఖరితో పాటు కేంద్రంలో చేస్తున్న అప్పుల్ని సైతం తెరపైకి తెచ్చి వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల దాడికి బీజేపీ కూడా కౌంటర్లు సిద్ధం చేసుకుంటోంది.

బీజేపీకి జగన్ బంపర్ ఛాన్స్
కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో ఇరుకునపడుతున్న జగన్.. ఎదురుదాడికి సిద్దమయ్యారు. దీంతో ఎప్పటి నుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ... సై అంటే సై అంటోంది. కేంద్రంతో జగన్ అవసరాలు ఎలాగో ఉండనే ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో తాము బలపడేందుకు కాషాయ పార్టీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఎదురుదాడిని అవకాశంగా తీసుకుని బీజేపీ నేతలు కూడా వార్ కు సిద్ధమవుతున్నారు. అటు కేంద్రంలోనూ బీజేపీ పెద్దలు జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు చేస్తున్న పోరును ప్రోత్సహిస్తూ జగన్ ను ఇరిటేట్ చేసే పనిలో ఉన్నారు. దీంతో జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ బీజేపీకి కచ్చితంగా కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు తరహాలోనే జగన్ పైనా
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తమను ప్రశ్నించడం మొదలుపెట్టగానే దూరం పెట్టేయడంతో పాటు ఎదురుదాడి ప్రారంభించిన బీజేపీ.. ఇఫ్పుడు జగన్ విషయంలోనూ అదే ప్లాన్ అనుసరించబోతోంది. జగన్ ను సాధ్యమైనంత ఎక్కువగా అసహనానికి గురి చేయటం ద్వారా తమను ప్రశ్నించేలా చేసి అప్పుడు ఎదురుదాడి వ్యూహం అమల్లో పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు తగినట్లుగానే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అదే వ్యూహం అమలు చేస్తోంది. దీంతో వైసీపీకి సహజంగానే అసహనం పెరుగుతోంది. అంతిమంగా చంద్రబాబు తరహాలోనే జగన్ పైనా ఒత్తిడి పెంచి తిరిగి ఈ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

2019 రిపీట్ తప్పదా ?
గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రశ్నించిన చంద్రబాబును టార్గెట్ చేసి ఎన్డీయే నుంచి బయటకు వెళ్లేలా చేసిన బీజేపీ.. ఇప్పుుడు తమకు బేషరతుగా మద్దతిస్తున్న జగన్ ను సైతం దూరం పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇందుకు జగన్ అనుసరిస్తున్న ఎదురుదాడి వ్యూహాన్ని వాడుకుంటోంది. తాజాగా ఉత్తరాంధ్రలో పర్యటించిన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్... గతంలో చంద్రబాబును ప్రశ్నించినట్లుగానే ఇప్పుడు జగన్ నూ పరోక్షంగా టార్గెట్ చేశారు. కేంద్ర పథకాలపై ప్రధాని మోడీ బొమ్మ పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. తద్వారా చంద్రబాబులా జగన్ కూడా కేంద్ర పథకాలను తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. అదే జరిగితే 2019 ఎన్నికలకు ముందు నెలకొన్న వాతావరణం తిరిగి రిపీట్ కావడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications