అమరావతికి వెళ్లే ఉద్యోగులకు ఏపీ సర్కారు బంపర్ ఆఫర్!
హైదరాబాద్/అమరావతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి హైదరాబాద్లోని ఏపీ ఉద్యోగులను తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు శాఖలకు చెందిన ఉద్యోగులను కూడా తరలించింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచే పాలనను కొనసాగించే వీలున్నా... అంతదాకా ఆగొద్దని ఏపీ సర్కారు తీర్మానించిన విషయం తెలిసిందే.
అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని చేపట్టి దాదాపుగా పనులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 27లోగా సచివాలయ ఉద్యోగులంతా వెలగపూడికి తరలిరావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విడతలవారీగా ఉద్యోగులు అక్కడికి తరలివెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.
Photos: వెలగపూడిలో ఎపి సచివాలయం
విద్యా సంతవ్సరం ప్రారంభమైన తర్వాత మొదలైన తరలింపులో భాగంగా ఉద్యోగులు కుటుంబాలతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయంలో మహిళా ఉద్యోగులు మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో వారి పరిస్థితిని గమనించిన చంద్రబాబు సర్కారు వారికో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. అమరావతి తరలివెళ్లే ఉద్యోగులకు ఆరు నెలల పాటు ఉచితంగా హాస్టల్ వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఇప్పటికే రంగంలోకి ఉన్నతాధికారులు మహిళా ఉద్యోగుల హాస్టళ్ల కోసం స్థలాన్వేషణ చేస్తున్నారు. ఈ హాస్టల్ సౌకర్యం కావాల్సిన ఉద్యోగులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.