జంట హత్యల కేసులో 9మందికి జీవిత ఖైదు: బస్సు బోల్తాపడి 50మందికి గాయాలు
శ్రీకాకుళం/ప్రకాశం: జంట హత్యల కేసులో ప్రకాశం జిల్లా మార్కాపురం న్యాయస్థానం తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించింది. మార్కాపురం మండలం అమ్మవారిపల్లెలో 2011లో జంట హత్యలు జరిగాయి.
ఈ కేసుపై విచారణ చేపట్టిన మార్కాపురం కోర్టు తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించింది. వీరందరికీ జీవితఖైదు విధిస్తూ మార్కాపురం ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి శుక్రవారం తీర్చు ఇచ్చారు.
బస్సు బోల్తా: 50మందికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అంపురం చెరువులో శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడగా, మరో 30మందికి స్వల్ప గాయాలయ్యాయి.
సోంపేట మండలం నుంచి కంచిలి మీదుగా గంగాధరపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అంపురం వద్ద అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. గాయపడిన వారిని సోంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని శ్రీకాకుళంలోని రిమ్స ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 100 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది.
గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు
నెల్లూరు: గంజాయి ముఠా గుట్టు రట్టయ్యింది. దొరవారిసత్రంలో 50 కేజీల గంజాయిని తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పరారయ్యారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకున్నారు. పరారైనవారు దక్షిణాఫ్రికా దేశానికి చెందినవారిగా గుర్తించారు. కాగా, పోలీసుల నిర్లక్ష్యం వల్లే మరో ఇద్దరు నిందితులు పరారయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.