నంద్యాల ఉప ఎన్నిక: రెచ్చగొట్టొద్దు... గెలిచినా ఇవన్నీ నిషేధం
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించవద్దని ఎస్పీ గోపినాథ్ తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించవద్దని ఎస్పీ గోపినాథ్ తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెచ్చగొట్టొద్దు
నంద్యాల పట్టణంలో 30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయవద్దని, కవ్వింపు చర్యలకు గానీ పాల్పడవద్దన్నారు.
Recommended Video
ర్యాలీలు, బాణసంచా పేల్చడంపై నిషేధం
ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ర్యాలీలు, బాణసంచా పేల్చడం నిషేధించినట్లు ఎస్పీ తెలిపారు. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి 600 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇతర పోలీసు బలగాలు, పారా మిలటరీ బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇవన్నీ నిషేధం
ఓట్ల లెక్కింపు కేంద్రం సమీప ప్రాంతాల్లో ఎవరైనా గుంపులు గుంపులుగా చేరితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, డప్పులు వాయించడం, పెద్ద శబ్దాలు చేయడం వంటి వాటిని నిషేధమన్నారు.
ఆ రహదారుల మూసివేత
పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున అటువైపు వెళ్లే దారులను మూసివేశారు. పలు రహదారులు మూసివేసినందున, ఇందుకు ప్రజలు సహరించాలని ఎస్పీ కోరారు.