మీ దోపిడీతో మేం నష్టపోతున్నాం: తెలంగాణపై బైరెడ్డి
హైదరాబాద్: కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల జలదోపిడీతో రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతోందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామనడం విడ్డూరమని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు.
ఈ నెల 26వ తేదీన జలమండలి కార్యాలయం ఎదుట జల సాధన దీక్ష చేస్తానని బైరెడ్డి చెప్పారు. కర్నాటక అక్రమ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడటానికి పాలక పెద్దలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులపై ఓ స్పష్టత వచ్చింది. విశాఖ జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
టీడీపీ అభ్యర్థులు ఎంవీవీఎస్ మూర్తి, పప్పల చలపతి రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రెండు స్థానాలకు ఒక్కో నామినేషనే దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం టీడీపీ వశమైంది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థి రెడ్డి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లా ఎమ్మెల్సీగా ద్వారపురెడ్డి జగదీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.
స్వతంత్య అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో జగదీశ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రకాశం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి అట్ల పెదవెంకట రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ పోరులో మాగుంట (టీడీపీ), అట్ల చినవెంకట రెడ్డి (వైసీబీ) నిలిచారు.