విశాఖలో కేబుల్ వైర్లు కట్: పవన్ కాకినాడ స్పీచ్ చూడకుండా చేశారు
అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ ప్రత్యక్ష ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. పవన్ ప్రసంగించే సమయంలో విశాఖపట్నంలోని గాజువాకలో గుర్తు తెలియని దుండగులు కేబుల్ వైర్లు కత్తిరించారు.
దీంతో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని చూడనీయకుండా ఎవరో కావాలనే కేబుల్ వైర్లను కట్ చేశారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబుల్ వైర్లు కట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ అభిమానులు కేబుల్ టీవి ఆపరేటర్లకు ఫిర్యాదు చేశారు.

కాగా, కాకినాడలో నిర్వహించి బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా ఏదో తీపి కబురు ఇస్తారనుకుంటే రెండు లడ్డూలు ఇచ్చారని, మన పాతిక మంది ఎంపిలకే అవి సరిపోవని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన లడ్డూల కంటే తాపేశ్వరం, బందరు లడ్డూలే బాగుంటాయని చెప్పారు.
కాంగ్రెస్ వాళ్లు వెన్నుపోటు పొడిచారని బీజేపీ దగ్గరకు వెళ్తే.. బీజేపీ వాళ్లు పొట్టలో పొడిచారని అన్నారు. అటు తెలంగాణకూ న్యాయం చేయలేదని, వాళ్లకు హైకోర్టును ప్రత్యేకంగా ఇవ్వమంటే ఇవ్వడంలేదని.. ఇటు ఏపీకి హోదా ఇవ్వడం లేదని అడుగుతుంటే రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారని విమర్శించారు.
రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత ఈజీ కాదని కొంత మంది నాయకులు విమర్శించారని అన్నారు. వారిలా తాను అవకాశవాద రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని పవన్ స్పష్టం చేశారు. తాను ఒక సైద్ధాంతిక బలంతో వచ్చానని, ప్రజా సమస్యలను చదివి వచ్చానని అన్నారు.












Click it and Unblock the Notifications