బెజవాడలో వణికిస్తున్న 'కాల్ మనీ': బాబు ఆగ్రహం, తాట తీస్తామని బొండా ఉమ
గుంటూరు: విజయవాడలో కాల్ మనీ దందా కలకలం రేపుతోంది. డబ్బు అవసరం ఉన్న వారిని గుర్తించి అప్పులు ఇస్తున్న కాల్ మనీ వ్యాపారులు ఆ తర్వాత అధిక వడ్డీల కోసం రుణం తీసుకున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేదనే కారణంతో ఓ బాధిత కుటుంబం కూతురును అపహరించిన మహిళ... ఆ బాలికను వేశ్యావాటికకు అమ్మేసింది. ఇది నగరంలో కలకలం రేపింది. తాజాగా, అప్పుకు వడ్డీ చెల్లించలేదన్న కారణంతో తన భర్తను నిర్బంధించి చితకబాదారని ఓ మహిళ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
కాల్ మనీ వ్యాపారుల దాష్టీకాన్ని ఆమె చంద్రబాబుకు ఆదివారం నాడు వివరించారు. బాధిత మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్న చంద్రబాబు సదరు విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
విజయవాడలో కొత్తగా కాల్ మనీ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దీనిపై సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వర రావు స్పందించారు. అధిక వడ్డీల పేరిట ప్రజలను హింసించే వారి తాట తీస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కాల్ మనీ వ్యవహారం ఇటీవల రెండు రోజులుగా వరుసగా వెలుగు చూస్తోంది. కాల్ మనీ వ్యాపారుల దందాపై సమగ్ర సమాచారం సేకరించిన బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను వేధించే వారిని తమ ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించబోదన్నారు. అక్రమ దందారాయుళ్లు తమ దందాను తక్షణమే నిలిపివేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.