కాల్ మనీ: దేవినేని ఉమ సైలెంట్, నేతలపై చంద్రబాబు గరం?
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారం కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలను బట్టబయలు చేసిందని అంటున్నారు. కాల్ మనీ వ్యాపారం చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ, అందులో భాగంగా సెక్స్ రాకెట్ నడవడం, ఆస్తులను కొల్లగొట్టడం వంటి విషయాలు ఉండడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. సెక్స్ రాకెట్తో ముడివడి ఉన్న కేసును తప్పు దారి పట్టించడానికి అధికార తెలుగుదేశం పార్టీ కాల్ మనీ రాష్ట్రవ్యాప్తంగా ఉందని చూపించడానికి ప్రయత్నిస్తోందనే విమర్శ వస్తోంది.
కాల్ మనీ వ్యాపారంతో అన్ని పార్టీల నాయకులకు సంబంధం ఉందనే విషయం కాదనలేని విషయమే. కానీ, సెక్స్ రాకెట్తో ముడి పడి ఉన్న కేసులోని నిందితులకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులతో సంబంధాలున్నాయనేది తీవ్రమైన విషయంగా మారింది.
కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో ఉన్న ప్రధాన నిందితులు గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం కోసం పనిచేశారని అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అదే మాట అన్నారు. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు.
ఫలితాలు వెల్లడైన అనంతరం యలమంచిలి రాము, వెనిగళ్ళ శ్రీకాంత ఎమ్మెల్యేలు, మంత్రులకు సన్మానాలు చేశారు. దానికి పది లక్షల రూపాయలు ఖర్చు చేశారని అంటారు. ఆ కార్యక్రమం జరిగిన రోజు కూడా మంత్రి దేవినేని ఉమాను ఆయన సన్నిహితులు నివారించే ప్రయత్నం చేశారని, అయితే పార్టీ నాయకుడు ఆంజనేయులుకు రాము బంధువు కావడంతో ఉమా వెళ్ళాల్సి వచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
కాల్మనీకి సంబంధించి నగరంలో అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ లైంగిక వేధింపులు ఉన్న కేసు రాము ముఠా మీదనే నమోదైంది. కాల్మనీ మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నప్పటికీ, నగరంలో లైంగిక ఆరోపణలతో కేసు నమోదు కావడంతో ఇది అధికార పార్టీకి చిక్కులు తెచ్చి పెడుతోంది.
అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో ప్రతిపక్ష నేత అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇటు జిల్లా ఎమ్మెల్యేల పాత్ర గురించి దాడి చేసినప్పుడు కూడా జిల్లా ఎమ్మెల్యేలు పెద్దగా స్పందించలేదు. జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం అటు సభలోనూ ఇటు బయట కూడా ఏమీ మాట్లాడలేదు. ఆయన మౌనం వెనక రహస్యమేమిటని సొంత పార్టీ నాయకులే అడిగే పరిస్థితి వచ్చింది.
కాగా, అసెంబ్లీలో కాల్మనీ వ్యవహారంపై జరిగిన చర్చలో పార్టీ నాయకులు ఎవరూ తగిన విధంగా స్పందించలేకపోయారని చంద్రబాబు పార్టీ నాయకుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని పార్టీపై జరిగిన దాడిగా నాయకులు భావించకపోవడాన్ని ఆయన తప్పుబట్టినట్టు తెలిసింది. మొత్తం మీద కాల్ మనీ వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకున్నట్లే.