నా అన్నను అరెస్ట్ చేసుకోవచ్చు, సిగ్గు సిగ్గు : కాల్ మనీపై బుద్ధా వెంకన్న సవాల్
విజయవాడ: కాల్ మనీ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న స్పందించారు. కాల్ మనీ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. దీంతో బుద్ధా వెంకన్న స్పందించారు.
కాల్ మనీ వ్యవహారంతో తమ పార్టీకి, తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం లేదని బుద్ధా స్పష్టం చేశారు. పార్టీలోని ఇతర వ్యక్తులకు సంబంధం ఉంటే కఠిన చర్యలు తప్పవన్నారు. కాల్ మనీ కేసులో నిందితుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.
కాల్ మనీ వ్యవహారంలో నేను నిందితుడిగా తేలితో మీరు చెప్పే ఏ శిక్షకైనా సిద్ధమని విలేకరుల సమావేశంలో అన్నారు. కొందరు రాజీనామా అంటూ చెబుతారని, కానీ నేను మీరు చెప్పే ఏ శిక్షకైనా సిద్ధమని చెబుతున్నానని వ్యాఖ్యానించారు. కాల్ మనీ వ్యవహారంలో అన్ని పార్టీల వాళ్లు ఉన్నారని చెప్పారు.

కాల్ మనీ వ్యవహారం సిగ్గుతో తలదించుకునే విషయమని చెప్పారు. తమ పైన రాజకీయ కోణంలో కొందరు బురద జల్లుతున్నారని చెప్పారు. కాల్ మనీ వ్యవహారంలో బాధితులు డబ్బులు కట్టవద్దన్నారు. ఎవరైనా కట్టమని వేధిస్తే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతమాత్రం సహించరని చెప్పారు. కాల్ మనీకేసులో తన అన్న బుద్ధా ప్రసాద్ పైన వచ్చిన ఆరోపణల పైనా స్పందించారు. తన అన్నయ్యతో తనకు సంబంధం లేదని చెప్పారు. తాము ఎంతోకాలంగా విడిపోయి ఉంటున్నామన్నారు.
ఆయన వ్యాపారాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన అన్నయ్యను అరెస్టు చేసినా తాను స్పందించనని తెలిపారు. తన అన్నయ్యకు ఎవరైనా డబ్బులు ఇవ్వవలసి ఉంటే అవి ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. కాల్ మనీ వ్యవహారంలో అన్ని పార్టీల వారు ఉన్నారన్నారు.
రేపు హైకోర్టులో పిల్
కాల్ మనీ వ్యవహారంలో బాధితులు సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తమకు న్యాయం విషయమై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, కాల్ మనీ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల వ్యవహారంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బెజవాడలో కాల్ మనీ వ్యవహారం తీవ్ర కల్లోలం రేపుతోంది.












Click it and Unblock the Notifications