తెలంగాణలో మైక్లు బంద్: ఏప్రిల్ 30న సెలవు
హైదరాబాద్: తెలంగాణలో ప్రచార ఘట్టానికి తెర పడింది. ఈనెల 30న ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సెలవు పాటించని యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఆయన చెప్పారు.
సోమవారం సాయంత్రంతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిసిందని భన్వర్లాల్ తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు అయిన భూపాలపల్లి, ములుగు, భద్రాచలం నియోజకవర్గాలలో ఈ సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని ఆయన తెలిపారు. అలాగే సిర్పూర్. అచ్చంపేట, చెన్నూర్, అసిఫాబాద్, ఖానాపూర్, మండలం, కొల్లాపూర్ నియోజకవర్గాలలో 5 గంటలకు, మిగిలిన అన్నీ నియోజక వర్గాలలో 6 గంటలకు ఎన్నికల ప్రచారాలు ముగిస్తాయని భన్వర్లాల్ వెల్లడించారు.
సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈనెల 30 (బుధవారం) సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాలో ఎటువంటి ఓపీనీయన్, ఎగ్జిట్ పోల్స్ను నిర్వహించకూడదని భన్వర్లాల్ సూచించారు. ఎల్లుండి జరగనున్న ఎన్నికల పోలింగ్కు మెత్తం 2,81,74,055 మంది ఓటర్లు హాజరు కానున్నారని, ఈ సారి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆయన తెలియజేశారు. పురుషులు 1,37,81,277 మహిళా ఓటర్లు, 1,43,82,661 మంది పురుషులు ఉన్నట్లు భన్వర్లాల్ చెప్పారు. ఎ
న్నికలు సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని భన్వర్లాల్ తెలిపారు.
ఇదిలావుంటే, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. పోలింగ్ కోసం 20వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, వస్తువులు పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అభ్యర్థి వాహనంతో పాటు మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, ఒక్కో వాహనంలో డ్రైవర్తో పాటు ఐదుగురికి మించి ఉండరాదని చెప్పారు.