ఏపీలో విషాదం.. బోరున విలపిస్తున్న హైదరాబాద్ వాసులు !!
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలంలో చోటుచేసుకుంది. మృతులంతా హైదరాబాద్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
కాగా ఆరుగురు కారులో తిరుపతి నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ( డిసెంబర్ 26, 2025 ) తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో.. కారు ఆళ్లగడ్డ సమీపానికి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జరుకున్నట్టు భావిస్తున్నారు. దీంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి.. కారు వేగంగా రోడ్డు డివైడర్ను దాటి ఎదురుదిశలోకి వెళ్లి, హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టినట్టు చెబుతున్నారు.

ప్రమాద తీవ్రత..
ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయి, వాహనం గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. ఢీకొన్న సమయంలో కారు లోపల ఉన్న నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు.
ఇక ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు, క్షతగాత్రులను అతికష్టం మీద బయటకు తీసి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు బస్సులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప షాక్కు గురైనప్పటికీ ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారిని మరో వాహనంలో గమ్యస్థానాలకు పంపించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కే. ప్రమోద్ కుమార్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి కారణం..?
అయితే ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దీర్ఘ ప్రయాణాల సమయంలో డ్రైవర్లు సరైన విశ్రాంతి తీసుకోకపోవడం ఇలాంటి ఘోర ప్రమాదాలకు దారి తీస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications