ఓటుకు నోటులో బాబుకు క్లీన్చిట్ ? వ్యవస్ధలపై నమ్మకం పోతుందన్న వైసీపీ-టీడీపీ హ్యాపీ
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఈడీ దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ టీడీపీకి భారీ ఊరటనివ్వగా.. వైసీపీకి మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఇన్నాళ్లూ ఈ కేసులో చంద్రబాబు పాత్రపై వరుసగా విమర్శలు చేస్తున్న వైసీపీ తాజా ఈడీ ఛార్జిషీట్లో ఆయన పేరు నేరుగా ప్రస్తావించకపోవడంతో ఇరుకునపడింది. దీంతో ఈడీ ఛార్జిషీట్పై వైసీపీ విమర్శలకు దిగుతోంది. అదే సమయంలో తాజా పరిణామాలతో వైసీపీ ఆరోపణలు అబద్ధాలని తేలాయని టీడీపీ సంబరపడుతోంది.
Recommended Video
ఓటుకు నోటులో ట్విస్ట్
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేసేందుకు ఆయన్ను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారంలో గతంలో ఏసీబీ ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. ఇందులో ఏసీబీ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి వేరుగా కేసు నమోదు చేసింది. ఇందులో తాజాగా ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏసీబీ ఛార్జిషీట్లో ఎప్పుడైతే చంద్రబాబు పేరు నేరుగా లేదో ఈడీ ఛార్జిషీట్లోనూ అదే పరిస్ధితి కనిపించింది. దీంతో టీడీపీకి ఈ వ్యవహారంలో భారీ ఊరట లభించినట్లయింది.
చంద్రబాబుకు క్లీన్చిట్
ఓటుకు నోటు కేసంటేనే చంద్రబాబు అన్నట్లుగా ఓ దశలో తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది. అదే క్రమంలో వైసీపీ కూడా దాన్ని అందిపుచ్చుకుని ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం వల్లే చంద్రబాబు హైదరాబాద్ వదిలి అమరావతి వచ్చేశారని ఆరోపణలు చేసింది. కానీ చివరకు అటు ఏసీబీ ఛార్జిషీట్లో కానీ ఇటు ఈడీ ఛార్జిషీట్లో కానీ నేరుగా చంద్రబాబు ప్రస్తావన లేకపోవడంతో ఆ ఆరోపణలన్నీ తేలిపోయాయి. ఇది అంతిమంగా టీడీపీకి భారీ ఊరటనివ్వగా.. వైసీపీకి మాత్రం ఇబ్బందికరంగా మారింది.
బాబుకు క్లీన్చిట్పై వైసీపీ విమర్శలు
ఓటుకు నోటు కేసుపై ఈడీ ఛార్జిషీట్లో చంద్రబాబు పేరు లేకపోవడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో బాబును వదిలేస్తే చట్టం, రాజ్యాంగంపై నమ్మకం పోతుందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. భారత న్యాయ వ్యవస్థ మీద, ఐపీసీ మీద, సీఆర్పీసీ మీద, ఎవిడెన్స్ యాక్ట్ మీద ఇండియాలో ప్రజలకు నమ్మకం ఉండాలంటే ఓటుకు కోట్లు కేసులో తెరవెనుక నుంచి నడిపించిన బాబును ఇప్పటికైనా అరెస్ట్ చేయాలన్నారు. కనీసం విచారణకు కూడా పిలిపించకుండా చంద్రబాబును వదిలేస్తే.. ఈ దేశంలో వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో అర్థంకాని పరిస్థితి ఉంటుందన్నారు.
బాబుకు క్లీన్చిట్పై టీడీపీ ఖుషీ
ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జిషీట్లో చంద్రబాబుకు క్లీన్చిట్ లభించిందని టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రస్తావన లేకుండా కేవలం రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పేర్లు మాత్రమే ప్రస్తావనకు రావడంతో టీడీపీ నేతల్లో హర్షం వ్యక్తమైంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లభించలేదని దర్యాప్తు సంస్ధలు పేర్కొన్నాయని, చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ పారిపోయి వచ్చారంటూ వైసీపీ మంత్రులు, నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించారని టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. చంద్రబాబుకు క్లీన్చిట్ రావడంపై ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తారని ఆయన ప్రశ్నించారు.