సండ్రకు రెండ్రోజుల ఏసీబీ కస్టడీ: బెయిల్ పిటిషన్పై ఎసిబి కౌంటర్
హైదరాబాద్:సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కోర్టు అనుమతి నేపథ్యంలో సండ్రను రెండు రోజుల పాటు తెలంగాణ ఏసీబీ కస్టడీకి తీసుకోనుంది. రేపు, ఎల్లుండి (గురు, శుక్రవారాలు) సండ్రను ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు విచారించేందుకు ఏసీబీకి న్యాయస్థానం అనుమతించింది.
అంతకుముందు..
ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును కోర్టు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు వెలువరించనుంది. కస్టడీ పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తీర్పును వాయిదా వేసింది.
డబ్బు ఎవరు ఇచ్చారనే అంశంతో పాటు కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున ఐదు రోజుల పాటు సండ్రను తమ కస్టడీకి ఇవ్వాలని ఎసిబి కోర్టును కోరింది. కస్టడీకి ఇవ్వాలనే ఎసిబి అభ్యర్థనను సండ్ర తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు.
కాగా, సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి (గురువారానికి) వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పిటిషన్పై ఎసిబి కౌంటర్ దాఖలు చేసింది. సండ్ర సాక్షులను ప్రభావితం చేస్తారని, ఏసీబీ విచారణకు సహకరించకుండా రాజమండ్రి వెళ్లారని ఏసీబీ ఆరోపించింది.

ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు అనుమానం ఉందని, దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఎసిబి కోర్టుకు తెలిపింది. టీటీడీ సభ్యుడిగా, టీటీడీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా సాక్షులను ప్రభావితం చేసే హోదాలో సండ్ర వెంకటవీరయ్య ఉన్నారని, ఈ కేసు కీలకదశలో ఉన్నందున సండ్రకు బెయిల్ ఇవ్వవద్దని ఏసీబీ కోర్టుకు సమర్పించిన కౌంటర్లో తెలిపింది.
కాగా, విశాఖపట్నంలో చదువుతున్న తన పిల్లలను చూడడానికి తాను అక్కడికి వెళ్లానని, అనారోగ్యానికి గురి కావడంతో తాను రాజమండ్రిలో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరానని సండ్ర మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. హైదరాబాదులోని తన నివాసానికి ఎసిబి నోటీసు అతికించిన విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. తెలిసిన వెంటనే తాను ఎసిబికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications