గవర్నర్పై దాడి పెంచిన టిడిపి: ఆరోపణలకు తెలంగాణ వివరణ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు నేపథ్యంలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సహా మంత్రులు, టిడిపి నాయకులు గవర్నర్ గవర్నర్పై దాడిని పెంచారు. తమకు సహకరించడం లేదని టిడిపి గవర్నర్పై ధ్వజమెత్తుతోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో సెక్షన్ 8ను అమలు చేయడంలో గవర్నర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలకు దిగింది.
గవర్నర్ కేవలం తెలంగాణ వైపే మక్కువ చూపుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు గత రెండు రోజులుగా మీడియా సమావేశాలు పెట్టి ప్రకటనలు చేస్తున్నారు. కొత్తగా ఎమ్మెల్సీగా పదవి పొందిన పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో పాటు మంత్రి రావెల కిషోర్బాబు, పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు సోమవారంనాడు వేర్వేరుగా మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేశారు. గవర్నర్ను బదిలీ చేయించడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోందని అంటున్నారు. తాజాగా, మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గవర్నర్ బాధ్యతలను గుర్తు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో గవర్నర్కు అదనపు అధికారాలు ఇవ్వాలని, పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ని తక్షణం అమలు చేయాలని టిడిపి నాయకులు వాదిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖకు వినతిపత్రాలు సమర్పించారు. దానికి తోడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు కూడా గత వారం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్కు ఇదే అంశం మీద విజ్ఞాపనపత్రాన్ని సమర్పించారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతివాదనలు వినిపించింది. తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సెక్షన్ - 8 గురించి కేంద్ర హోం కార్యదర్శికి రెండు వారాల క్రితం వివరించారు. ఇప్పటివరకు హైదరాబాదులో శాంతిభద్రతలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు దాఖలు కాలేదని, శాంతిభద్రతలకు జరిగిన విఘాతం కూడా ఏమీ లేదని, పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగానే కేంద్రం వ్యవహరించాలని స్పష్టం చేశారు.
హైదరాబాదు నగరంలో తెలంగాణేతరులు ప్రశాంతంగా ఉన్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులూ లేవని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి మాత్రం సెక్షన్-8ని అమలు చేయడం సాధ్యం కాకపోతే గవర్నర్కు అదనపు అధికారాలు కల్పిస్తూ కేంద్రం స్వతంత్రంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించవచ్చని, ఆ విధంగా సెక్షన్-8ని అమలు చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది.
కానీ అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని రాజీవ్శర్మ స్పష్టం చేశారు. అవసరమైతే రాజ్యాంగ సవరణకు కూడా కేంద్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని ఐవైఆర్ కృష్ణారావు వాదించారు. మార్గదర్శకాలను రూపొందించడానికి చట్ట సవరణ అవసరం లేదని, నిబంధనలను రూపొందించాలన్నపుడు మాత్రమే రాజ్యాంగ సవరణ అవసరమని మీడియాకు వివరించారు.












Click it and Unblock the Notifications