జగన్ కు సీబీఐ షాక్-ఆస్తుల కేసు విచారణకు హాజరుకావాల్సిందే-మినహాయింపు ఇవ్వొద్దని వినతి
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రస్తుతం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. ఈ విచారణ నుంచి సీఎంగా ఉన్న తనకు మినహాయింపు కావాలని జగన్ కోరారు. అయితే సీబీఐ కోర్టు ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా దీన్ని ముగించి తీర్పును రిజర్వ్ చేసింది.
సీబీఐ కోర్టులో జరుగుతున్న అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ చేసుకున్న అభ్యర్ధనపై సీబీఐ హైకోర్టుకు తన అభిప్రాయం చెప్పేసింది. జగన్ కు ఈ దశలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దంటూ హైకోర్టుకు తెలిపింది. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. జగన్ హోదా పెరిగినందున సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొంది. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని సీబీఐ తెలిపింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని కోర్టుకు వెల్లడించింది.
అక్రమాస్తుల కేసులో జగన్ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ కేసులో ఇప్పటికే జగన్ వాదనకు సీబీఐ మద్దతు పలకకపోవడంతో హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. ఈసారి సీబీఐ చేసిన వాదన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో రఘురామరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తన వాదన చెప్పకుండా దాటవేసిన సీబీఐ.. ఈసారి జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పడం విశేషం. దీంతో ఈ కేసులో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
సీఎంగా పాలనలో బిజీగా ఉంటున్నందున అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. కోర్టు అంగీకరిస్తే తన న్యాయవాదిని విచారణకు పంపుతానని చెప్తున్నారు. కానీ సీబీఐ మాత్రం జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరుతోంది.