ఓబుళాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సంకటం-జూలై 5 డెడ్ లైన్- వెయ్యి జరిమానా
ఓబుళాపురం గనుల్లో అక్రమ తవ్వకాలకు అనుమతిచ్చిన వ్యవహారంలో తొమ్మిదేళ్ల క్రితం సీబీఐ నమోదు చేసిన క్రిమినల్ కేసులో ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ తో పాటు బళ్లారి మైనింగ్ కార్పోరేషన్ కు గనుల శాఖ అధికారి హోదాలో శ్రీలక్ష్మి అనుమతులు ఇచ్చినట్లు సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్ని కొట్టేయాలంటూ 2015లోనే ఆమె పెట్టుకున్న పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే సీబీఐ కోర్టులో వాదనలు వినిపించేందుకు ఆమె మరింత సమయం కోరారు. దీంతో సీబీఐ కోర్టు ఆమెకు వెయ్యి జరిమానా విధించింది.
వెంటాడుతున్న ఓబుళాపురం
గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గనుల శాఖ కార్యదర్శి హోదాలో ఐఏఎస్ శ్లీలక్ష్మి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ కు అక్రమంగా అనుమతులు ఇచ్చినట్లు సీబీఐ కేసులు నమోదు చేసింది. తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసుల్ని శ్రీలక్ష్మి సవాల్ చేసినా ఇంకా వాటిపై పిచారణ పూర్తి కాలేదు. దీంతో హైదరాబాద్ సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మిపై విచారణ యతాతథంగా కొనసాగుతోంది. ఓబుళాపురం కేసులో సీబీఐ దాఖలు చేసిన అదనపు ఛార్జిషీట్ పై వాదనలు వినిపించాల్సిన శ్రీలక్ష్మి న్యాయవాదులు అదనపు సమయం కావాలని కోరుతుండగా... సీబీఐ కోర్టు నిరాకరిస్తోంది.
ఐఏఎస్ శ్రీలక్ష్మికి వెయ్యి జరిమానా
ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్ పై విచారణ సీబీఐ కోర్టులో కొనసాగుతోంది. ఈ సమయంలో శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ మొదలైంది. ఇందులో వాదనలు వినిపించేందుకు సీబీఐ కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ పై జూలై 2న విచారణ ఉన్నందున ఆ తర్వాత వాదనలు వినిపిస్తామని తెలిపారు. కానీ దీనికి సీబీఐ కోర్టు నిరాకరించింది. హైకోర్టు విచారణపై స్టే విధించనందున గడువు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. చివరికి వెయ్యి రూపాయల జరిమానా చెల్లిస్తే జూలై 5కు కేసు వాయిదా వేసి వాదనలు వింటామని తెలిపింది. దీంతో సీబీఐ కోర్టు ప్రతిపాదనకు అంగీకరించి వెయ్యి రూపాయలు చెల్లించి జూలై 5న వాదనలు వినిపించేందుకు శ్రీ లక్ష్మి అవకాశం పొందారు.
శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు వార్నింగ్
ఓబుళాపురం మైనింగ్ కేసులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు గడువు ముగియడంతో వెయ్యి జరిమానా విధించి జూలై 5న డెడ్ లైన్ ఇచ్చిన సీబీఐ కోర్టు... ఆ రోజు వాదనలు వినిపించకపోతే మాత్రం తగిన ఉత్తర్వులుూ జారీ చేయాల్సి ఉంటుందని శ్రీలక్ష్మిని హెచ్చరించింది. వాస్తవానికి హైకోర్టులో ఓబుళాపురం మైనింగ్ కేసులో తాను దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. ఇందులో హైకోర్టు ఉత్తర్వులు సానుకూలంగా వస్తాయని అంచనా వేస్తున్న శ్రీలక్ష్మి.. అంతవరకూ సీబీఐ కోర్టులో విచారణ వాయిదా కోరుతున్నారు. కానీ సీబీఐ కోర్టు మాత్రం జూలై 2న హైకోర్టులో విచారణ ఉన్నందున ఈ కేసు విచారణను జూలై 5కు వాయిదా వేసింది.