నరసరావుపేట శతాబ్ధి ఉత్సవాలపై కోడెల, టీడీపీలోకి ఆనం సోదరులపై సోమిరెడ్డి
అమరావతి: నరసరావుపేట పట్టణం పురపాలక సంఘం 100 ఏళ్ల వేడుకల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శతాబ్ధి వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం నరసరావుపేటలో 2కే వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల, మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
ముందుగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి పల్లె రఘునాథరెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ఈ 2కే వాక్ పల్నాడు రోడ్డులోని శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీ నుంచి ప్రారంభమై శివుని విగ్రహం కూడలి, ఆర్వోబీ కూడలి, సతెనపల్లి రోడ్డు మీదుగా కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం వరకు సాగింది.
ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ శతాబ్ధి ఉత్సవాలను అభివృద్ధికి అంది వచ్చిన అవకాశంగా భావించాలన్నారు. అనంతరం మంత్రి పల్లె మాట్లాడుతూ యువకులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. హరిత నరసరావుపేట సాధనకు ప్రతి ఒక్కరూ ఏడాదికి ఐదు మెక్కలు చొప్పున నాటాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో నరసరావుపేట పురపాలక సంఘం శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించనున్నారు. శతాబ్ధి ఉత్సవాల వేడుకలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభులు కూడా ఈ ఉత్సవాలకు హాజరవుతున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సుబ్బరాయగుప్త, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీలు మధుసూదనరావు, నాగేశ్వరరావు, ఈఈ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నరసరావుపేట పట్టణంలో 1,17,568 మంది జనాభా నివసిస్తున్నారు.
ల్యాండ్ లార్డ్ మాల్రాజు వెంకట నరసింహారావు పేరు మీదగా నరసరావు పేటకు ఆ పేరు వచ్చింది. మే 18, 1915న నరసరావు పేటకు మున్సిపాలిటీ హోదా లభించింది. ఆ తర్వాత ఏప్రిల్ 28, 1980లో గ్రేడ్-I మున్సిపాలిటీ రూపాంతరం చెందింది.
అంతేకాదు నరసరావు పేట పట్టణాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాలుక్యులు, చోళులు, కాకతీయులు, కొండవీడు రెడ్డి రాజులు పరిపాలించారు. పల్నాడు ప్రాంతానికి నరసరావు పేట పట్టణం గేట్ వేగా ఉంటుంది.
టీడీపీలోకి ఆనం సోదరుల చేరికపై సోమిరెడ్డి
తెలుగుదేశం పార్టీలోకి ఆనం సోదరుల చేరికపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీకి, నాయకుడికి విధేయంగా ఉండేవాళ్లు ఎవరు చేరినా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
టీడీపీలోని ఆనం సోదరుల చేరికను తాము ఆహ్వానిస్తున్నామన్నారు. పార్టీ అధినేత మాటే తమకు శిరోధార్యమన్న సోమిరెడ్డి అదే సమయంలో కార్యకర్తల మనోభావాలను సైతం గుర్తించాల్సి ఉందన్నారు.