మోదీ కేబినెట్ లో ఏపీకి మరో పదవి - చంద్రబాబు ఛాయిస్, పవన్ ట్విస్ట్..!!
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీ - పాలనా పరంగా కీలక నిర్ణయాల దిశగా మోదీ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు .. ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తి చేసేలా మంత్రాంగం సాగుతోంది. ఇక.. కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీకి మరో బెర్తు దక్కటం దాదాపు ఖాయమైంది. ఈ సారి ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.
ఏపీకి మరో పదవి
మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ త్వరలో కీలక రాష్ట్రాల ఎన్నికల ను ఎదుర్కోనుంది. ఈ సమయంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా బీజేపీ అగ్రనాయకత్వం మిత్రపక్షాలతో చర్చిస్తోంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో.. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనుండగా.. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోనూ ఎన్నికలకు సమయం సమీపి స్తోంది. దీంతో.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతు న్నాయి. ఈ రెండు రాష్ట్రాల కు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామైలకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది.

రేసులో జనసేన
అదే సమయంలో ఏపీ నుంచి రెండు మిత్రపక్ష పార్టీలు ఉండగా.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా.. పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్ లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవి పైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు - పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి.
ఛాన్స్ దక్కేదెవరికి
కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాగా, అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమా చారం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర.. కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. దీంతో, ప్రాంతీయ - సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో రెడ్డి వర్గానికి అవకాశం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఇక.. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఏపీ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కనుందనేది స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications