ఏపీ ప్రభుత్వ అప్పీల్ లో కేంద్రం ఇంప్లీడ్ : ఇళ్ల నిర్మాణం నిలిపివేతపై రంగంలోకి -30 లక్షల జీవితాలతో..!!
ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం పేదలందరికీ ఇళ్లు విషయంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దన్న హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్లో కేంద్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కానుంది. పథకం అమల్లో భాగంగా కొన్ని అంశాల పైన న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని పైన ఒక కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. కమిటీ నివేదిక వచ్చే వరకూ నిర్మాణాలు చేపటొద్దంటూ స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వ అప్పీల్ లో కేంద్ర ఇంప్లీడ్
అయితే, దీని పైన ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ లో తాము ఇంప్లీడ్ అవుతామంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ హైకోర్టుకు నివేదించారు. సింగిల్ జడ్జి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేసి పూర్తివివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. ఇందుకు అనుమతివ్వాలని కోరారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించిన తరువాత అనుమతి విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామంది.
30 లక్షల జీవితాలకు సంబంధించని
తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ గురించి మంగళవారం అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ వ్యవహారం 30 లక్షల మంది జీవితాలకు సంబంధించినదని తెలిపారు.
కోర్టు తీర్పు సరైంది కాదంటూ
ఇప్పటికే కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీని కోర్టు ముందుంచామని, అత్యవసరం దృష్ట్యా ఈ వ్యాజ్యంపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఇది పీఎంఏవైతో ముడిపడి ఉన్నందున తమ అప్పీల్లో కేంద్రం ప్రతివాదిగా ఉండటం తప్పనిసరి అని తెలిపారు. ఈ సమయంలో ఏఎస్జీ హరినాథ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్లో ఇంప్లీడ్ అవుతామని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయని చెప్పారు.
ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక స్కీం
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఇంటి నిర్మాణాల పైన లబ్ది దారుల ఎంపిక..వారికి ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల ద్వారా నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని భావిస్తోంది. కేసులతో పధకాన్ని అడ్డుకుంటున్నారంటూ అధికార పక్ష నేతలు ప్రతిపక్షం పైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం సైతం ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించటం ద్వారా ఇప్పుడు ఈ కేసు విచారణ.. తదనంతర పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.