గవర్నర్కు 'పవర్': కేసీఆర్కు రఘువీరా, బాబు లేఖ
హైదరాబాద్: శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోనే ఉండాలని, సెంటిమెంట్ కోసం అనవసర వివాదాలు చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సరికాదని, గవర్నర్కు శాంతిభద్రతల బాధ్యత అంశం విభజన చట్టంలోనే ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం అన్నారు. హైదరాబాద్, తెలంగాణలకు మేలు జరగాలంటే శాంతిభద్రతల బాధ్యత గవర్నర్ చేతిలోనే ఉండాలన్నారు. అయినా విభజన చట్టంలోనే గవర్నర్కు శాంతిభద్రతల బాధ్యత అంశం ఉందన్నారు.
గవర్నర్ చేతిలోనే ఉంచాలి: చంద్రబాబు
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు పరిధిలోని పోలీస్ వ్యవస్థ గవర్నర్ చేతిలోనే ఉంచాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని కమిషనర్లు, ఉన్నతాధికారుల నియామకాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి జరిగేలా చూడాలన్నారు. ఉమ్మడి రాజధానిలోని శాంతిభద్రతల అంశం గవర్నర్ పరిధిలో ఉంటుందనే విషయాన్ని విభజన చట్టంలోను పేర్కొన్నారన్నారు.

హైదరాబాదులో నివసిస్తున్న ప్రజల జీవితాలను, స్వేచ్ఛని, వారి ఆస్తులను కాపాడేందుకే ఈ ఏర్పాటు జరిగిందన్నారు. అంతర్గత భద్రతతో పాటు ఉమ్మడి రాజధాని పరిధిలోని ప్రభుత్వ భవనాల రక్షణను కూడా ఆ చట్టంలో స్ప్టష్టం చేశారన్నారు. హైదరాబాదులో నివసిస్తున్న సీమాంధ్రుల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని వారికి రక్షణగా నిలిచేందుకు చట్టంలో ఈ భాగాన్ని నిర్దేషించారన్నారు. ఉమ్మడి రాజధాని పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, ఇతర అధికారులు గవర్నర్కు బాధ్యులుగా ఉండాలన్నారు.
ఒప్పుకోం: కేసీఆర్
శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ పరిధిలోకి తీసుకు రావడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిందని, ఆ లేఖలో రాష్ట్ర పరిధిలో ఉండే శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ పరిధిలోకి తీసుకు రావాలంటూ సూచించిందని కేసీఆర్ తెరాస ఎంపీలతో చెప్పారు. విభజన చట్టం సెక్షన్ 8లో గవర్నర్కు కొన్ని ప్రత్యేక అధికారులు ఇస్తున్నట్లు చెప్పారని, దీనిని ఉటంకిస్తూ కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.
గవర్నరుకు ప్రత్యేక అధికారాలను కట్టబెడితూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను సవరించాలని చెప్పిందని ప్రజలను రెచ్చగొట్టేలా, విద్వేషాలు ఉసిగొల్పే చర్యలకు పాల్పడటం, వేధించడం వంటి వాటికి సంబంధించిన కేసులను గవర్నర్లు నేరుగా పర్యవేక్షించేలా చూడాలని, ఫైళ్లను కూడా ఆయనే తెప్పించుకనే అధికారం ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీల నియామకం, బదిలీల్లో గవర్నర్ జోక్యం ఉంటుందని, జాయింట్ పోలీసు ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పిందని తెలిపారు.
ఉమ్మడి పోలీసు బోర్డుపెట్టాలని చెప్పిందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ చేతికి అధికారాలు అప్పగించేందుకు సిద్ధంగా లేదని, ఇదే విషయాన్ని తాము కేంద్రానికి స్ఫష్టం చేశామన్నారు. ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును పార్లమెంటు వేదికగా ప్రశ్నించాలని, ఇప్పుడు తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేస్తే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తనకు ఇష్టం లేని ప్రతి రాష్ట్రంలో ఈ పద్ధతిని బలవతంగా రుద్దుతుందన్నారు.












Click it and Unblock the Notifications