బిజెపి, కిరణ్: రాయలపై కేబినెట్ వెనుకడుగు ఎందుకు?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీతో సహా పలు పార్టీలు మద్దతివ్వమని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాయలసీమను చీల్చవద్దని సూచించడంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాయల తెలంగాణపై తగ్గినట్లుగా తెలుస్తోంది. పది రోజులుగా కేంద్రం రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే, అనూహ్యంగా చివరి నిమిషంలో రాయల టిపై తగ్గారు. అంతేకాదు రాయల పైన ఎవరు చెప్పారని, ఎప్పుడూ ఆలోచించలేదని కేంద్రమంత్రులు, జివోఎం సభ్యులు తెలిపారు. అయితే రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకు వస్తే తాము పార్లమెంటులో మద్దతిచ్చేది లేదని బిజెపి స్పష్టం చేయడంతో పాటు కిరణ్ కూడా సీమను చూల్చవద్దని సూచించారట. అదే సమయంలో తెలంగాణ ప్రజల్లోను ఆగ్రహం పెల్లుబుకింది.
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిఓఎం రాయలతెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు అధినాయకత్వాన్ని కలిసి జివోఎం ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలి లేకపోతే సీమాంధ్రతోపాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్కు పుట్టగతులు లేకుండా పోతాయని హెచ్చరించారు.
రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ను క్షమించరని హెచ్చరించారు. ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాయలసీమను విడదీసే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారట. రాయలసీమను విభజించటం ఎంత మాత్రం మంచిది కాదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది.