ఏపీలో శాంతిభద్రతలపై కేంద్రం సీరియస్- గవర్నర్ ను నివేదిక కోరిన హోంశాఖ...
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరుకు ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న దాడులకు సంబంధించి హైకోర్టు సీరియస్ అయిన 24 గంటల్లోనే కేంద్రం కూడా గవర్నర్ నివేదిక కోరింది. ఏపీలో తాజా శాంతి భద్రతల పరిస్ధితిపై ఓ నివేదిక పంపాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది. ఏపీలో టీడీపీకి చెందిన పలువురు నేతలపై స్ధానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దాడులు, అంతకు ముందు విశాఖ విమానాశ్రయంలో విపక్ష నేత చంద్రబాబును అడ్డుకోవడంపై కేంద్ర హోంశాఖ స్పందించి నివేదిక కోరినట్లు తెలుస్తోంది.

ఏపీలో వరుస దాడులు
ఏపీలో స్ధానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే విశాఖ పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన విశాఖ పర్యటనకు వెళ్లకుండానే విమానాశ్రయం నుంచే వెనుదిరిగారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై దాడులతో పాటు పల్నాడు వెళ్తున్న టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై సైతం దాడులు జరిగాయి. ఇందులో వైసీపీ నేతలు పాలుపంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఇవన్నీ స్ధానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దాడులేనని వైసీపీ సర్కారు చెబుతోంది.

దాడులపై హైకోర్టు సీరియస్..
విశాఖ పర్యటన సందర్భంగా విపక్ష నేతకు అనుమతి ఇచ్చి, ఆ తర్వాత తిరిగి 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి వెనక్కి పంపడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వైసీపీ కార్యకర్తలు విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడంపై స్పందించిన హైకోర్టు.. చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా అని ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం వైసీపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో డీజీపీ సవాంగ్ కు కూడా హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి రావడం సమస్యగా మారింది.

పల్నాడులో ఎన్నికల దాడులు.
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో స్ధానిక ఎన్నికల్లో నామనేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న టీడీపీ అభ్యర్ధులను వైసీపీ కార్యకర్తలు పలుచోట్ల అడ్డుకున్నారు. అదే సమయంలో విజయవాడ నుంచి వారిని పరామర్శించడానికి బయలుదేరిన టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపైనా వెదురు బొంగులతో వైసీపీ నేత కిషోర్ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడులను స్ధానిక పోరులో భాగంగానే చూడాలని హోంమంత్రి సుచరిత చెప్పుకొచ్చారు. అంతే కాదు టీడీపీ నేతలు బయటికి వెళ్లటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని కూడా సలహా ఇచ్చారు.
Recommended Video


దాడులపై కేంద్రం సీరియస్
ఏపీలో విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుపై దాడితో మొదలుపెట్టి స్ధానిక ఎన్నికల పోరులోనూ కొనసాగుతున్న వైసీపీ దాడులపై కేంద్ర హోంశాఖకు ఎప్పటికప్పుడు నిఘా నివేదికలు అందుతూనే ఉన్నాయి. అదే సమయంలో హైకోర్టు కూడా డీజీపీని పిలిపించి మరీ చీవాట్లు పెట్టడంతో ఈ వ్యవహారం సీరియస్ అని కేంద్రం గుర్తించినట్లయింది. దీంతో తాజాగా శాంతి భద్రతల పరిస్ధితిపై నివేదిక ఇవ్వాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications