బలహీనతల్లో వైసీపీ, టీడీపీ పోటాపోటీ- అందుకేనా కేంద్రం కూల్ ? -అసలు రీజన్స్ ఇవే
ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ముగిసిన అథ్యాయమంటూ మరోసారి కేంద్రం ఇవాళ పార్లమెంటులో చేసిన ప్రకటనతో రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీల విషయంలోకేంద్రం వైఖరి తేటతెల్లమైపోయింది. ఆ మాటకొస్తే ప్రత్యేక హోదాయే కాదు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ సిద్ధం లేదని తేలిపోయింది. అంటే ఈ ఐదేళ్ల కాలంలోనూ తమకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేని ఏపీలో ఎలాంటి హామీ కూడా నెరవేర్చేందుకు కేంద్రం ముందుకు రాదని తేలిపోతోంది. దీన్ని గమనిస్తే కేంద్రం నిర్లక్ష్యం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని చెప్పాల్సిన అవసరం లేదు.

ఏపీ ప్రత్యేక హోదా
ఏపీకి ఏడేళ్ల క్రితం రాజ్యసభలో కేంద్రమిచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇప్పటికీ నెరవేరలేదు. అంతే కాదు ఎప్పటికీ నెరవేరబోదనే క్లారిటీ కూడా కేంద్రం పదే పదే ఇచ్చేస్తోంది. అయినా మనం అడుగుతూనే ఉంటామంటూ అధికార వైసీపీ జనాన్ని నమ్మిస్తోంది. అంటే అడుగుతూ ఉంటే ఎప్పుడో అప్పుడు ఇస్తుందని చెబుతోంది. టీడీపీ అయితే అసలు తమకు ఆ హామీతో సంబంధమే లేదన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో కేంద్రం కూడా ఇంత కీలకమైన హామీని చాలా సులువుగా చెత్తబుట్టలో పడేసింది. ఇదొక్కటే కాదు ఏపీకి ఇచ్చిన ప్రతీ హామీ విషయంలోనూ కేంద్రం ఇదే తీరు ప్రదర్శిస్తోంది.

బలహీనతల్లో వైసీపీ, టీడీపీ పోటాపోటీ
రాజకీయంగా చూస్తే ఏపీలో అత్యంత బలంగా కనిపిస్తున్న వైసీపీతో పాటు అత్యంత బలహీనంగా కనిపిస్తున్న టీడీపీకి ఓ విషయంలో మాత్రం సారూప్యత కనిపిస్తోంది. అదే ఏపీకి ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించే విషయంలో బలహీనత. ఇందుకు ఎవరికి వారు తమవైన కారణాలతో ముందుకు సాగిపోతున్నారు. దీంతో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని వైసీపీని టీడీపీ కానీ, టీడీపీని వైసీపీ కానీ ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా హాయిగా ఊపిరిపీల్చుకుంటోంది.

జగన్ అక్రమాస్తుల కేసులు
వైసీపీ అధినేత కమ్ సీఎంగా కూడా ఉన్న వైఎస్ జగన్ కు ఆక్రమాస్తుల కేసు శాపంగా మారుతోంది. ఈ కేసులో జగన్ ఎదుర్కొంటున్నన్ని కేసులు, ఛార్జిషీట్లు, పిటిషన్లు దేశంలో ప్రస్తుతం మరే ఇతర రాజకీయ నేత కూడా ఎదుర్కోవడం లేదు. దీంతో జగన్ ను గుప్పిట్లో ఉంచుకోవడానికి కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కు బలమైన కారణం దొరికింది. జగన్ ఎక్కడైనా తోక జాడిస్తే చాలు సీబీఐని, ఈడీని ఉసిగొల్పడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దీంతో జగన్ తన బలహీనతను బలంగా మార్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగని గతంలో కాంగ్రెస్ పై తిరగబడినంత సులువుగా బీజేపీపై తిరగబడే పరిస్ధితులు కనిపించడం లేదు. దీంతో ఏపీకి ఒక్క హామీ అమలు చేయలేకపోయినా కేంద్రానికి జగన్ పదే పదే మద్దతు ఇస్తూనే ఉన్నారు. పార్లమెంటులో బయటా కూడా ఎన్డీయేకు అండగా నిలుస్తున్నారు.

నోరు విప్పితే చంద్రబాబు పరిస్ధితీ ఇదే
పైకి జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కి విలవిల్లాడుతున్నట్లు కనిపిస్తున్నా ఓటుకు నోటుతో పాటు ఇతర కేసుల్లో చంద్రబాబు పరిస్ధితి కూడా అదే. కానీ అవి అంత వేగంగా తెరపైకి రావడం లేదు. కానీ గతంలో చేసినట్లుగా ధర్మపోరాటానికి చంద్రబాబు దిగితే మాత్రం కేంద్రం ఆయనపైనా కొరడా ఝళిపించడం ఖాయం. ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు అమిత్ షా సైతం చంద్రబాబుకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా దూరం పెడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నోరెత్తితే ఆయన్నూ కేసులు చుట్టుముట్టడం ఖాయం. అందుకే ఇప్పుడు టీడీపీతో పాటు చంద్రబాబు కూడా బీజేపీని పల్లెత్తుమాట అనేందుకు సిద్ధపడటం లేదని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.
Recommended Video

వైసీపీ, టీడీపీ బలహీనతలతో కేంద్రం గేమ్
అక్రమాస్తుల కేసులతో జగన్, ఓటుకు నోటు, తెరపైకి రాని మరెన్నో వ్యవహారాలతో చంద్రబాబు కేంద్రం చేతుల్లో బందీలుగా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ ప్రత్యేక హోదాయే కాదు కేంద్రం గతంలో ఇచ్చిన మరే ఇతర హామీ కూడా అమలు చేయకున్నా నోరు విప్పబోరని అర్ధమైపోతోంది. దీంతో గతంలో ఐదేళ్ల పాటు ఏపీకి ఏమీ చేయకున్నా కూల్ గా కాలం గడిపేసిన కేంద్రం.. మరో ఐదేళ్ల పాటు అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయినా అటు చంద్రబాబు కానీ, ఇటు జగన్ కానీ ఏమీ మాట్లాడలేని పరిస్ధితి. గతంలో చంద్రబాబు కేంద్రంతో సఖ్యతగా ఉన్న సమయంలో కనీసం చంద్రబాబు ద్వారా కేంద్రాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించిన జగన్ ఇప్పుడు ఆ పనీ చేయలేకపోతున్నారు. అలాగని చంద్రబాబు సైతం జగన్ ను అదే టైపులో టార్గెట్ చేయలేకపోతున్నారు. దీంతో ఇదే అదనుగా కేంద్రం కూడా మౌనంగా కాలం గడిపేస్తోంది.












Click it and Unblock the Notifications