టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని తిరస్కరించారు.
తిరుపతి: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ఆయన తిరస్కరించారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేదని ఆయన అన్నారు.
టీటీడీకి తన సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తానని చాగంటి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటానని అన్నారు. కాగా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జనవరి 20న జరిగిన ధార్మిక పరిషత్ సమావేశంలో టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, చాగంటి ఆ పదవిని తిరస్కరించారు.

కాగా, ఇటీవల చాగంటి కోటేశ్వర రావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్కరించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేశారు. ఆ సమయంలో చాగంటి వెంట శాంతా బయోటెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వర రావు ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలో ఉన్న గోశాలను సందర్శించారు. గోశాలను ఏర్పాటు చేయడం అత్యుత్తమ నిర్ణయమని సీఎంను ప్రశంసించారు. గోశాల అద్భుతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.
కాకినాడకు చెందిన చాగంటి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. ఉద్యోగిగా తన విధులు నిర్వహిస్తూనే.. ఆ తర్వాత సమయాల్లో ప్రవచనాలు చెబుతూ అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు.












Click it and Unblock the Notifications