వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని ముందు అన్నీ సవాళ్ళే.. ఆదిలోనే అష్టకష్టాలు, అధిగమిస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత నూతనంగా బాధ్యతలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆదిలోనే అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఘటనలు మహిళా మంత్రి రజినికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. మహిళా మంత్రుల సమర్ధతకు సవాల్ విసురుతున్నాయి.

విజయవాడ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ .. విడదల రజినికి చిక్కులు
కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా ఏపీని తీర్చి దిద్దుతామని, ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని బాధ్యతలు చేపట్టిన తొలి నాడు చెప్పారు. అయితే విడదల రజిని బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మానసిక దివ్యాంగురాలి పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ప్రభుత్వాసుపత్రిలోనే గ్యాంగ్ రేప్ చోటుచేసుకోవడంతో ఈ వ్యవహారం అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి చిక్కులు తెచ్చిపెట్టింది.

టార్గెట్ చేసిన టీడీపీ.. ఏపీలో దుమారంగా మారిన గ్యాంగ్ రేప్
విజయవాడ మానసిక దివ్యాంగురాలి గ్యాంగ్ రేప్ పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ప్రతిపక్షాల ఆందోళనలతో ఈ వ్యవహారంలో విడదల రజిని టార్గెట్ అయ్యారు. ఈ వ్యవహారం వాసిరెడ్డి పద్మ ఎపిసోడ్ తో మరింత రచ్చగా మారింది. ఇక ఈ వ్యవహారం ముగిసేలోపే మరో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపింది.

రుయా ఆస్పత్రి ఘటన, రేపల్లె అత్యాచార ఘటన.. మహిళా మంత్రులకు షాక్
ఇక ఇదే సమయంలో మంత్రి విడదల రజినికి తిరుపతి రుయా ఆస్పత్రిలో 9 ఏళ్ల బాలుడు శవాన్ని తరలించడం లో చోటుచేసుకున్న అమానవీయ ఘటన మళ్లీ కాక తగిలేలా చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులను ప్రస్తావిస్తూ టిడిపి తీవ్రస్థాయిలో మళ్లీ విడదల రజినిని టార్గెట్ చేశారు. ఈ ఘటన వల్ల ఇబ్బంది పడిన రజిని, ఇక తాజాగా రేపల్లె లోని రైల్వే స్టేషన్ లో మహిళపై జరిగిన అత్యాచార ఘటన విషయంలోనూ ఇబ్బంది పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ ఘటన విడదల రజిని జిల్లాలోనే చోటుచేసుకోవడంతో ఈ వ్యవహారం కూడా ఆమెకు తలనొప్పిగా మారింది.

కోనసీమ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి.. మంత్రి ముందు అన్నీ సవాళ్ళు
ఇక మరోవైపు కోనసీమ జిల్లాలో ఆసుపత్రి లేక గర్భిణీలకు వాటర్ ట్యాంక్ కిందనే వైద్య సేవలు అందిస్తున్న వ్యవహారాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారు అంటూ నిలదీస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పటానికే విడదల రజిని అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ సమస్యలను విడదల రజిని అధిగమిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా తయారయింది. అటు చంద్రబాబు, నారా లోకేష్ లతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న దారుణ ఘటనలను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న వేళ కొత్త మంత్రులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.

సమస్యలను విడదల రజిని అధిగమిస్తారా?
ఇక టిడిపి నేతలు అసమర్థ మంత్రులకు పట్టం కట్టారని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో చేసిన వ్యాఖ్యలు, నిజమవుతున్నాయి అన్నట్టుగా తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రుల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టి విడదల రజిని తమ శాఖను సమర్థవంతంగా నడిపించడానికి ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న వ్యవహారం.












Click it and Unblock the Notifications