సీఎం జగన్ ఇంటి ముట్టడి, ఛలో తాడేపల్లి ర్యాలీలతో సీఎం ఇంటి పరిసరాల్లో ఉద్రిక్తత , డ్రోన్లతో నిఘా!!
ఆంధ్రప్రదేశ్ సర్కారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమ నిరసన తెలియజేయడానికి వివిధ యువజన విద్యార్థి సంఘాలు చేపట్టిన ఛలో తాడేపల్లి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సీఎం జగన్ ఇంటి ముట్టడికి తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలు, తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ తో పాటుగా ఎస్ఎఫ్ఐ ,వివిధ యువజన, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ర్యాలీగా వెళ్లడంతో సీఎం జగన్ నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం జగన్ నివాసం ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని టీడీపీ, వామపక్ష పార్టీల విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. (1/2) pic.twitter.com/BM2JruLVgn
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) July 19, 2021

తాడేపల్లిలో ఉద్రిక్తత .. డ్రోన్లతో భద్రతా నిఘా
ఆందోళనకారులను తాడేపల్లి పాత టోల్ గేట్ కూడలి దగ్గర అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉంటే నిరుద్యోగ యువత కోసం ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అణచివేయడానికి భారీగా మోహరించిన పోలీసులు నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని తేల్చి చెప్తున్నారు. డ్రోన్ కెమెరా లతో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు, సీఎం జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా సుమారు వెయ్యి మంది పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

జగన్ ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న ఆందోళనకారులు అరెస్ట్ .. పోలీస్ స్టేషన్ లోనూ ఆందోళన
ఇక ఇదే సమయంలో ఆందోళన చేస్తూ సీఎం జగన్ ఇంటికి ర్యాలీగా బయలుదేరిన ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సైతం ఆందోళనకారులు తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన తెలుగు యువత నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇదే సమయంలో టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు పార్టీ కార్యాలయం నుండి సీఎం ఆఫీస్ ముట్టడికి వెళతారని సమాచారంతో అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

నిన్నటి నుండి కొనసాగుతున్న గృహ నిర్బంధాలు , అణచివేత కార్యక్రమాలు
నిన్నటి నుంచి గృహనిర్బంధాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. విద్యార్థి సంఘాల, యువనేత యువజన సంఘాల నాయకులను అరెస్టులకు పాల్పడుతున్న పోలీసులు ఛలో తాడేపల్లిని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు . ఇక నిరుద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం ఇంటిని ముట్టడించి తీరుతామని తేల్చి చెప్తున్నారు. పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ సర్కార్ పై టీడీపీ ధ్వజం .. తాడేపల్లిలో వాతావరణం ఉద్రిక్తం
టిడిపి వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేయడాన్ని టిడిపి తీవ్రంగా ఖండిస్తుందని టీడీపీ వెల్లడించింది . రెండు లక్షల 30 వేల పోస్టుల భర్తీకి నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. జగన్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ధ్వజమెత్తుతోంది. సీఎం జగన్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతలు నినాదాలతో, తోపులాటలతో, ముట్టడి ప్రయత్నాలతో తాడేపల్లి ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications