జగన్ లక్ష్యంగా : చంద్రబాబు నయా స్కెచ్: కేసీఆర్కు అందుకే ఆ..సంకేతాలు ..!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఏపీలో ఎన్నికల సమయంలో ఒక విధంగా వ్యవహరించిన చంద్రబాబు..ఇప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సందర్భానుసారం రాజకీయ వ్యూహాలు రచించటంతో చంద్రబాబు సిద్ద హస్తులు. దీంతో..ఇప్పుడు ఆయన ఇస్తున్న తాజా సంకేతాల వెనుక పరోక్షంగా జగన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీలో తాజాగా చేసిన ఈ వ్యాఖ్యల వెనుక పరమార్ధం పైన చర్చ మొదలైంది..
అసలు లక్ష్యం..జగన్..మోదీ..
దేశ వ్యాప్తంగా ఎన్నికలు కొనసాగుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు ఏపీలోనూ..ఢిల్లీలోనూ జగన్-మోదీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందు కోసం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మోదీకీ వ్యతిరేకమైన నాటి నుండి ఆయన సంగతి బాగా తెలిసిన వ్యక్తిగా..రాజకీయ పరిణామాలను అంచనా వేయగలిగన నేతగా వెంటనే బేషజాలు మరిచి..పర్యవసానాలను పక్కన పెట్టి నేరుగా రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి మరీ సమావేశమయ్యారు. మోదీ కి వ్యతిరేకమనే పేరుతో అన్ని పార్టీల నేతలతో కొంత కాలంగా కలివిడిగా ఉంటున్నారు. మోదీతో సఖ్యతతో ఉన్న సమయంలో వారందరితో దూరం పాటించిన చంద్రబాబు..ఇప్పుడు అదే మోదీకి వ్యతిరేకంగా వారికి దగ్గర అయ్యారు. ఇక, మోదీ ఓటమి ఖాయమని చాలా ధీమాగా చెబుతున్నారు.
కేసీఆర్..జగన్ మధ్య చంద్రబాబు..
ఏపీలో ఎన్నికల సమయంలో మోదీ..జగన్..కేసీఆర్ ఒక్కటే అంటూ చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ప్రతీ సభ లోనూ చెప్పారు. ఏపీకీ అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేసారు. ఎన్నికలు పూర్తయిన తరువాత కేసీఆర్ గురించి ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేసారనేది స్పష్టమవుతోంది. ఇక, జగన్ కు జాతీయ స్థాయిలో బీజేపీ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మద్దతుగా నిలుస్తున్నారనేది చంద్రబాబు అంచనా. జగన్కు ఎవరి నుండి మద్దతు లేకుండా చేయాలనేది బాబు వ్యూహం. అందుకోసం కేసీఆర్ ప్రతిపాదిన ఫ్రంట్లో చేరాలని ఇప్పటికే కేటీఆర్ స్వయంగా జగన్ను కలిసి ఆహ్వానించారు. తాజాగా, ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ గురించి వ్యాఖ్యానించటానికి నిరాకరించారు. మోదీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారితో కలవటానికి సిద్దమని పరోక్షంగా కేసీఆర్కు స్నేహ హస్తం అందించారు.
కేసీఆర్ అంగీకరిస్తారా..
చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ఇప్పుడు తాము మోదీకి వ్యతిరేకంగా లేమనే విషయం చెప్పలేరు. ఆలాగని..తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యుపీఏకు మద్దుత ఇవ్వలేరు. ఈ రెండు కూటములు కాకుండా..ప్రాంతీయ పార్టీల కూటమి ఒకరిని ప్రధానిగా ఎన్నుకొనే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో కేసీఆర్ తమకు సహకారం అవసరమని భావిస్తున్నారు. అయితే, చంద్రబాబును వ్యతిరేకించే కేసీఆర్ అందుకు ఆయనకు మద్దతిస్తారా అంటే ఇప్పటికైతే లేదనే చెప్పాలి. ఇక, ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే..జగన్ సైతం ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని..వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకే ప్రాధాత్య ఇవ్వటం ద్వారా జగన్ పైన పైచేయి సాధించవచ్చన్నది బాబు వ్యూహంగా స్పష్టమవుతోంది. ఏ విధంగా చూసినా జగన్కు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత లేకుండా చూడాలనేది చంద్రబాబు లక్ష్యం. అయితే, ఇది సాధ్యపడుతుందా లేదా అనేది 23న తేలనుంది.