ఏపీలో పాదయాత్రలపై విపక్ష నేతల క్లారిటీ-చంద్రబాబు, పవన్ ఆలోచన ఇదే ! అదే జరిగితే...
ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలకు ప్రత్యేకస్ధానముంది. గతంలో మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాదయాత్రలతోనే అధికారంలోకి వచ్చారు. విపక్షంలో ఉండగా వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర సైతం ఆయనకు భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టింది. దీంతో ఈసారి వైఎస్ జగన్ జోరును అడ్డుకునేందుకు విపక్ష నేతల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి వారు పాదయాత్రలు చేపడతారనే ప్రచారం ఉంది. కానీ తాజాగా వీరంతా పాదయాత్రలపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

ఏపీలో పాదయాత్రలు ఉంటాయా ?
ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేతల పాదయాత్రలు ఉంటాయా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలతో నేతలు అధికారం చేజిక్కించుకుంటున్న వేళ పాదయాత్రలు చేపట్టే విషయంలో వారు చాలా విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటుంటారు. ఈసారి కూడా విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాదయాత్రలు చేపడితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. అయితే ఇందులో ఎవరెవరు పాదయాత్రలుచేపట్టే అవకాశం ఉందన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

చంద్రబాబు పాదయాత్ర కష్టమే ?
ఇప్పటికే 80 ఏళ్లకు దగ్గర్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి పాదయాత్ర చేయడం కష్టమేననే చర్చ జరుగుతోంది. తనను కలిసిన నేతలతో పాదయాత్రపై చంద్రబాబు ఇదే విషయం స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి తాను పాదయాత్ర చేసే పరిస్ధితి ఉండకపోవచ్చని, దాని బదులుగా జనంలో విస్తృతంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. జిల్లాల టూర్ల రూపంలో, మినీ మహానాడుల రూపంలో చంద్రబాబు ఇప్పటికే జనంలో కనిపిస్తున్నారు. ఎన్నికల నాటికి మరింత విస్తృతంగా టూర్లు ప్లాన్ చేయడం మినహా పాదయాత్ర వైపు మొగ్గుచూపకపోవచ్చని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి.

లోకేష్ కు ఆసక్తి కరవు
గతంలో తన తండ్రి చంద్రబాబు రాష్ట్రంలో విస్తృతంగా పాదయాత్ర చేసి అధికారం కైవసం చేసుకున్న అనుభవం కళ్లముందే కనిపిస్తున్నా తనయుడు నారా లోకేష్ మాత్రం అదే బాటలో సాగేందుకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టూర్లు తిరుగుతున్న లోకేష్.. దూకుడుగానే రాజకీయాలు చేస్తున్నప్పటికీ పాదయాత్రతో ఏదో జరుగుతుందనే భ్రమల్లో లేనట్లు తెలుస్తోంది. దానికి బదులుగా జిల్లాల్లోనే విస్తృత పర్యటనలుచేపట్టి క్యాడర్ లో జోష్ నింపేందుకు, ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు లోకేష్ ప్రయత్నిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో లోకేష్ పాదయాత్ర ఆలోచన లేనట్లే చెప్తున్నారు.

పాదయాత్రతో అధికారం రాదన్న పవన్
చంద్రబాబు, లోకేష్ మాత్రమే కాదు ఈసారి ఎన్నికల్లో టీడీపీతో జతకడతారని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పాదయాత్రకు మొగ్గు చూపడం లేదు. తాజాగా ప్రెస్ మీట్లో సైతం పాదయాత్రలతో అధికారం వస్తుందంటే తాను నమ్మనని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పేశారు. ఇందుకు బీహార్లో నితీశ్ కుమార్, మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఉదాహరణలు కూడా గుర్తుచేశారు. తద్వారా పాదయాత్ర చేసే అలోచనలో తాను లేనట్లేనని చెప్పకనే చెప్పినట్లయింది. ఈ నేపథ్యంలో జనంలోకి విస్తృతంగా వెళ్లడానికి మరో మార్గం ఆలోచిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చేశారు. దీంతో ఈసారి రాష్ట్రంలో విపక్ష నేతల పాదయాత్రలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications