బాబు మరో కుట్ర, నోరు మూయిస్తారా లేక రిజైన్ చేస్తారా: రేవంత్కు హరీష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పైన మరో కుట్రకు తెరలేపారని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలపాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారని, దీని పైన తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావులు సమాధానం చెప్పాలని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం అన్నారు. ఆయన తెరాస భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాదు కృష్ణా బేసిన్లో ఉందని చెప్పారు. నిన్నటి వరకు పవర్ వంటి వాటి పైన కుట్రలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తాగునీటి పైన కూడా చేస్తున్నారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ చర్యలను టీడీపీ నేతలు ఖండిస్తారా లేక సమర్థిస్తారా చెప్పాలన్నారు. చంద్రబాబును వారు నిలదీస్తారా లేక ఇంకా టీడీపీ తోక పట్టుకొని వేలాడుతారా అని నిప్పులు చెరిగారు.

హైదరాబాదులో సకల సౌకర్యాలు అనుభవిస్తున్న చంద్రబాబు, అదే హైదరాబాదుకు నీళ్లు, విద్యుత్ రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుది విష కౌగిలి అన్నారు. హైదరాబాదుకు రావాల్సిన నీటి కేటాయింపులు గత ప్రభుత్వాలు అమలు చేయలేదని చెప్పారు. హైదరాబాదు కృష్ణా బేసిన్లో ఉందన్నారు.
హైదరాబాదులో గవర్నర్ పాలన కోసం కుట్రలు చేసిన చంద్రబాబు, నిన్నటికి నిన్న హైదరాబాదులోని న్యాక్కు తనకు తానే చైర్మన్గా ప్రకటించుకోవడం విడ్డూరమన్నారు. పాలమూరు, హైదరాబాదుకు నీరు తీసుకు వస్తామని కేసీఆర్ అంటుంటే, చంద్రబాబు వద్దంటున్నారని, దీని పైన రేవంత్ ఏం సమాధానం చెబుతారన్నారు. సీమాంధ్ర పక్షమా లేక తెలంగాణ పక్షమా తేల్చాలన్నారు. బాబుకు హైదరాబాదులో ఉండే హక్కు లేదన్నారు.
తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు నోరు మూయించాలి లేదా చేతకాకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నోటికాడి బుక్క లాక్కునే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారన్నారు. నిన్నటి దాకా చంద్రబాబు కరెంట్ కుట్రలు పన్నారని, తద్వారా రైతుల ఆత్మహత్యలకు పరోక్షంగా కారకుడయ్యారన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications