వాళ్లనిచూసి కాళ్లు నరుక్కుంది, జగన్ దేశభక్తుడా: బాబు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలను చూసి కాంగ్రెసు పార్టీ తన కాళ్లను నరుక్కుందని, ఇది తాను చెప్పిన మాట కాదని, కాంగ్రెసు పార్టీ నాయకులే అంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
175 నియోజకవర్గాలలో ఆందోళన చేసే వారు సమైక్యవాదులా అని జగన్ పార్టీని ప్రశ్నించారు. తాను ఢిల్లీలో ఎందుకోసం దీక్ష చేశాను, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ఏమంటున్నాయని మండిపడ్డారు. రెండు ప్రాంతాల ఐకాసలను పిలిపించి మాట్లాడాలని, సమస్యను సామరస్యంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కరించానని తాను కోరానన్నారు. అలా అంటే ఢిల్లీలో కూర్చొని అండగా నిలబడుతున్నారని జగన్ అనడమేమిటని ప్రశ్నించారు.
ఢిల్లీలో కూర్చొని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్క్రిప్ట్ రాస్తే కెసిఆర్, జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఇక్కడ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై వేసిన మంత్రుల బృందం రాష్ట్రానికి రాకుండా నెట్లో, ఎస్సెమ్మెస్ల ద్వారా అభిప్రాయ సేకరణ చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం మీద మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని అలాంటి రాష్ట్రాన్ని కాంగ్రెసు రాజకీయ లబ్ధి కోసం కుటిల రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.
నిన్న కిరణ్ చేసిందంతా డ్రామానే అని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జగన్ సమైక్యవాదిగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జైల్లో నుండి వచ్చిన వ్యక్తికి రెడ్ కార్పెట్ వేయడమేమిటని ప్రశ్నించారు. జైలు నుండి వచ్చిన వ్యక్తికి తనను విమర్శించే నైతిక అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. దత్తపుత్రులను తీసుకొచ్చి తమను పక్కన పెట్టిందని కాంగ్రెసు నేతలు చెబుతున్నారన్నారు.
మంత్రుల బృందం ఏం చేస్తుందో ఇప్పటి వరుక చెప్పలేదన్నారు. హైదరాబాదు పైన రోజుకో మాట మాట్లాడుతారని ధ్వజమెత్తారు. తీర్మానం, బిల్లు అంటూ కూడా నేతలు భిన్నంగా స్పందిస్తున్నారన్నారు. సమస్యను పరిష్కరించే మార్గం ఇదా అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీతో తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కై తనను విమర్శించడమేమిటని ప్రశ్నించారు. టిడిపి తెలుగు జాతి కోసం పుట్టిందన్నారు.
వైయస్ జగన్కు గవర్నర్ మూడుసార్లు అపాయింటుమెంట్ ఇచ్చేందుకు ఆయన ఏమైనా దేశభక్తుడా అని ప్రశ్నించారు. జగన్ సమైక్యం ముసుగులో విభజన కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు కలిపి సభలు పెట్టుకుంటాయేమోనని ఎద్దేవా చేశారు.