జీవోఎం: చేతులెత్తేసిన బాబు, దులిపేసుకున్న బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు) నివేదిక సమర్పించాల్సిన గడువు ముగిసినప్పటికీ తెలుగుదేశం పార్టీ తన నివేదికను పంపించలేదు. కేంద్ర మంత్రుల బృందానికి నివేదికను పంపించే విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేయగా, రెండు ప్రాంతాలకు చెందిన నేతల నివేదికలను సమర్పించి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేతులు దులిపేసుకున్నారు. పైగా, తమ పార్టీ మాత్రమే ఏకతాటిపై ఉందని చెప్పుకున్నారు. సిడబ్ల్యుసి నిర్ణయం శిరోధార్యమే అయినప్పటికీ రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సమర్థించుకున్నారు.
బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో సీమాంధ్ర నేతలతోనూ, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ సమక్షంలో తెలంగాణ నేతలతోనూ సమావేశమయ్యారు. జీవోఎంకు సమర్పించాల్సిన వంద పేజీల నివేదికను తెలంగాణ నేతలు బొత్స సత్యనారాయణకు అందించారు. ఆ నివేదికను నేరుగా వారు జివోఎంకు కూడా పంపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గతంలో కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర నాయకులు చేసిన తీర్మానం ప్రతిని సీమాంధ్రకు చెందిన నాయకులు అందజేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సాంకేతికంగా విభజనకు అంగీకరిస్తూ సమన్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమన్యాయం చేయడానికి అవసరమైన కసరత్తు చాలా వరకు జివోఎం వద్ద జరుగుతుంది. సీమాంధ్రకు తగిన న్యాయం చేయడానికి ఆయన సమగ్రమైన నివేదికను అందిస్తారని అందరూ భావించారు. కానీ, చివరకు జీవోఎంకు నివేదిక ఇవ్వకుండా, మధ్యేమార్గంగా ప్రధానికి, రాష్ట్రపతి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు.
జీవోఎంకు ఇవ్వాల్సిన నివేదికపై, లేదంటే ప్రస్తుతం తరుణంలో అనుసరించాల్సిన వైఖరిపై చంద్రబాబు తెలంగాణ, సీమాంధ్ర నేతలతో సుదీర్గంగా చర్చలు జరిపారు. చివరగా, మంగళవారం సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానికి, రాష్ట్రపతికి పంపే లేఖలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. అయినా, సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య చంద్రబాబు సామరస్యాన్ని, ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు.
చంద్రబాబు వద్దకు మూడు ప్రతిపాదనలు వచ్చాయి. ఆ మూడు ప్రతిపాదనలపై ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి, ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్ర విభజనను ఆపేయాలని కోరడం కూడా ఉంది. ఇరు ప్రాంతాల జెఎసిలను పిలిచి చర్చలు జరపాలని, జాతీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మరో రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, విభజనకు అంగీకరిస్తూ సీమాంధ్ర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేఖ రాస్తే సరిపోతుందని తెలుగుదేశం తెలంగాణ నేతలు సూచిస్తున్నారు. అయితే, వీరి మాట చెల్లుబాటు అవుతుందా అనేది సందేహమే.
గడువు కోరిన బిజెపి
కాగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య నినాదాన్ని తీసుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జివోఎంకు నివేదిక సమర్పించింది. అలాగే, సమైక్యవాదానికి కట్టుబడిన సిపిఎం కూడా నివేదిక సమర్పించింది. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఐ కూడా నివేదికలు అందించాయి. కాగా, బిజెపి మాత్రం మరింత గడువు కోరింది. ఈ నెల 7వ తేదీ వరకు సమయం ఇవ్వాలని బిజెపి జివోఎంను కోరింది. బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తే మద్దతు ఇస్తామని కూడా స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications