సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్ : పులివెందులలో ఓటమి ఖాయం : శాశ్వత పదవి చెల్లదు..!!
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత అంటూ దుయ్యబట్టారు. మద్యనిషేధం, సీపీఎస్, అమరావతిపై మాట తప్పి మడమతిప్పడం విశ్వసనీయతా అంటూ నిలదీసారు. పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి చెందిన అమర్ నాథ్ యాత్రికుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అమ్మను గెంటేసిన వాడు ప్రజలకు ఏమి చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పులివెందులలోనే జగన్ రెడ్డిని ఓడించడానికి పులివెందుల ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు.

అమ్మని గెంటేసిన వాడు
అమ్మని గెంటేసిన వాడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏం చేస్తారంటూ దయ్యబట్టారు. ఎన్నికలకు ముందు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చి.. ఇప్పుడు మూడు రాజధానులంటున్నారని చెప్పుకొచ్చారని ఫైర్ అయ్యారు. వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేశారంటూ మండి పడ్డారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పెన్షన్ రూ.3 వేలు చేస్తానని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అవకాశవాది, కరుడుగట్టిన నేరస్థుడంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, సెక్షన్ 29కు విరుద్ధంగా శాశ్వతంగా పార్టీ అధ్యక్షుడుగా ప్రకటించుకుని చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని చంద్రబాబు విశ్లేషించారు.

శాశ్వత ముఖ్యమంత్రినని కూడా
అవకాశం ఉంటే.. శాశ్వత ముఖ్యమంత్రినని కూడా ప్రకటించుకునే వారని ఎద్దేవా చేసారు. దేశంలో ఏ పార్టీ నేత కూడా తాను శాశ్వత అధ్యక్షుడినని ప్రకటించుకోలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారనే జగన్ రెడ్డి అబద్ధాలను సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. అభద్రతా భావం, విద్వేషంతోనే జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. జగన్ రెడ్డి కన్నా చంద్రబాబు సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేశారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిధులు దోపిడీ చేస్తూ జగన్ రెడ్డి సంక్షేమానికి కోతలు కోస్తున్నారని విమర్శించారు.

ఎక్కువ సంక్షేమం అమలు చేస్తామంటూ
టీడీపీ అధికారంలోకి వస్తే.. ఇంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. వైకాపా ప్లీనరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఆర్టీసీ బస్సులను, పారిశుద్ధ్య సిబ్బందిని, స్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇష్టారాజ్యంగా వినియోగించారని చెప్పారు. 1812 బస్సులకు రెండు రోజులకు గాను ఆర్టీసీకి దాదాపు రూ.10.87 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. వేల కోట్ల ఖర్చుకు ఆడిట్ లేదని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారని సమావేశంలో చర్చకు వచ్చింది. బాదుడే బాదుడు కార్యక్రమాలను కొనసాగించాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications