ఇవ్వబోమని చెప్పింది, కానీ ఎపి వేరు: బాబు, జగన్కు ఇష్టం లేదని...
విజయవాడ: రాష్ట్ర విభజనలో తప్పుడు విధానాల వల్ల కాంగ్రెసు పార్టీని ప్రజలు తిప్పికొట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబ నాయుడు అన్నారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన శనివారంనాడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాయలసీమకు నీరివ్వడం, ఎపికి రాజధానిని నిర్మించడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని చంద్రబాబు అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎపి అభివృద్ధి ఆగబోదని ఆయన స్పష్టం చేశారు. ఎపి అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిందేనని ఆయన అన్నారు.
ఎపిని అన్ని రాష్ట్రాలతో సమానంగా చూడకూడదని, ఆంధ్రప్రదేశ్ విభజనను కోరుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పిందని, అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరని ఆయన అన్నారు. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. పదేళ్ల తర్వాత రాహుల్ గాంధీకి రైతులు గుర్తుకు వచ్చారని, రైతు ఆత్మహత్యలపై మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదని ఆయన అన్నారు.
విభజనతో రాష్ట్రం 13 వేల కోట్ల నుంచి 14 వేల కోట్ల రూపాయల వరకు రెవెన్యూ లోటును ఎదర్కుంటోందని, అయినప్పటికీ తాము 23 వేల కోట్ల రూపాయల మేరకు రైతు రుణాలను మాఫీ చేశామని ఆయన చెప్పారు. విభజన వల్ల రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కుంటోందని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రానికి రాజధాని లేదని, పరిశ్రమలు లేవని ఆయన అన్నారు.

కాగా, టిడిపి విస్తృత స్థాయి సమావేశానికి ఎన్టీ రామారావు తనయుడు, పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ హాజరయ్యారు. పార్టీ విస్తృత సమావేశానికి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గం ఇంచార్జీలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications