జగన్ పనైపోయింది- ఈసారి వన్ సైడ్ ఎలక్షన్-టీడీపీలో గ్రూపులకు చెక్-చంద్రబాబు కామెంట్స్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాలు రోజురోజుకీ హీట్ పుట్టిస్తున్నాయి. ఇందులో జగన్ పాలనపై నిత్యం విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఇవాళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్, వైసీపీ పాలన, వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.

జగన్ పాలనపై చంద్రబాబు
సీఎం జగన్ అసమర్థ, అధ్వాన్న పాలనతో వైసీపీ పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. మహానాడు సక్సెస్, సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన న్యూట్రిఫుల్ యాప్ పైనా ఈ సందర్భంగా వివరించారు. మహానాడు ఈ స్థాయిలో విజయవంతం అవ్వడానికి గల కారణాలు కూడా నేతలకు చంద్రబాబు వివరించారు.

మహానాడు సక్సెస్ వెనుక
మూడేళ్ల అణిచివేత తో కార్యకర్తల్లో ఉన్న కసి, పాలకుల నిర్ణయాలతో కష్టాల్లో ఉన్న ప్రజల అసంతృప్తే మహానాడు గ్రాండ్ సక్సెస్ కు కారణం అని చంద్రబాబు తెలిపారు. కనీసం వాహన సౌకర్యం కూడా లేకుండా ఇబ్బందులు పెట్టినా వందల కిలోమీటర్ల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను జయప్రదం చేశారని చంద్రబాబు అన్నారు.
సొంతగా ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో జనం రావడం రాష్ట్రంలో రాజకీయంగా వచ్చిన మార్పుకు నిదర్శనం అని చంద్రబాబు అన్నారు. మహానాడు నిర్వహణలో మండువవారి పాలెం రైతులు భూమలుఇచ్చి సహకరించడాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒంగోలు నేతలు సమిష్టి కృషితో మహానాడును సక్సెస్ చేశారని....వారు చూపించిన స్ఫూర్తి,నమూనా అన్ని జిల్లాల నేతలు పాటించాలని చంద్రబాబు అన్నారు.

వైసీపీ బస్సు యాత్ర వెలవెల
వైసీపీ నిర్వహించిన బస్సు యాత్రకు జనం లేక వెలవెల పోతే, మహానాడు దగ్గర కంట్రోల్ చెయ్యలేని స్థాయిలో జనం తరలిరావడం టిడిపి పై నమ్మకాన్ని చాటుతోందని చంద్రబాబు అన్నారు. గడప గడపకూ వైసిపిని...గడప గడపకూ మన ప్రభుత్వం అని మార్చారని అయినా వ్యతిరేక స్పందన రావడంతో మళ్లీ బస్సు యాత్ర పెట్టారని వ్యాఖ్యానించారు. బస్సు యాత్ర కూడా ఎలా ఫెయిల్ అయ్యిందో రాష్ట్ర ప్రజలు చూశారని చంద్రబాబు గుర్తుచేశారు.

ఎన్నికల్లో వార్ వన్ సైడే
ప్రజలు వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగించాలని ఆయన సూచించారు. మెంబర్ షిప్ డ్రైవ్ కూడా వేగవంతం చెయ్యాలని సూచించారు.
తెలుగు దేశం పార్టీలో పార్టీ కమిటీల నియామకంపైనా నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. గ్రామ స్థాయి వరకు పెండింగ్ లో ఉన్న అన్ని కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని చెప్పారు. ఇదే సమయంలో పార్టీలో ఏ స్థాయిలోను గ్రూపులను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రూపులు కట్టే వారి విషయంలో కఠినంగా ఉంటానని...ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యకర్తలు ఒంటరి వారు కాదన్న చంద్రబాబు....వారికి కష్టం వస్తే పార్టీ చూసుకుంటుందని వివరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు పెంచాలని సూచించారు.












Click it and Unblock the Notifications