అనురాధ హత్య వెనుక ఎవరున్నా వదలం: బాబు ఆరా, మా కళ్లముందే కాల్చేశారు: డిప్యూటీ
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి యువనేత నారా లోకేష్, ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు తదితరులు బుధవారం మధ్యాహ్నం దుండగుల దాడిలో మృతి చెందిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ పార్థివ దేహాలకు నివాళులు అర్పించారు.
అనురాధ - మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతమైన... చిత్తూరు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. హత్య ఎలా జరిగిందనే విషయాన్ని పోలీసులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు.
ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించం: చంద్రబాబు
హత్య వెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు చెప్పారు. ప్రజాప్రతినిధుల భద్రత పైన పునఃసమీక్షిస్తామని చెప్పారు. మేయర్ అనరాధ, ఆమె భర్త హత్య దురదృష్టకరమన్నారు. ఈ హత్య కేసులో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారని, ఇద్దరి కోసం గాలిస్తున్నారన్నారు.
మా కళ్ల ముందే నుదుటిపై కాల్చారు: డిప్యూటీ మేయర్
అంతకుముందు, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి మాట్లాడారు. తమ కళ్ల ముందే హత్య జరిగిందని చెప్పారు. తమ ఎదుటే మేయర్ అనురాధ నుదుటి పైన దుండగులు కాల్చి చంపారన్నారు. ఆ తర్వాత మోహన్ పైన కత్తితో దాడి చేశారన్నారు. తాము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తుపాకీతో బెదిరించారన్నారు.
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. అనురాధ ఛాంబర్లో ఉన్న సమయంలో లోనికి ప్రవేశించిన దుండగులు వారిద్దరిని తుపాకీతో కాల్చి, కత్తులతో దారుణంగా పొడిచారు. అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త మోహన్ తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.