చంద్రబాబు కోసం 'జాతీయ రహదారి' వేస్తున్న కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నరు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నరేంద్రమోడీ-అమిత్ షా ద్వయాన్ని ఎదురించేందుకు, వారిని గద్దె దించేందుకే బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఆ దిశగా ఆయన తన పయనాన్ని, పార్టీ పయనాన్ని కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన కేసీఆర్
దేశవ్యాప్తంగా తెలుగువారు ఏ రాష్ట్రంలో ఎంత సంఖ్యలో ఉన్నారు? అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలేవి? తెలుగువారికోసమని పోటీచేస్తే స్పందన ఎలా ఉంటుంది? స్థానిక పార్టీలతో ఏమైనా పొత్తు పెట్టుకోవాలా? ఇత్యాది అంశాలపై కేసీఆర్ ఒక అంచనాకు వచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంద్వారా జాతీయ పార్టీకి కావల్సిన హోదాను సంపాదించవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
ప్రతి రాష్ట్రంలో, ప్రతినియోజకవర్గంలో తెలుగువారి లెక్కలు సేకరించిన కేసీఆర్ ఆ తర్వాత చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఆయన బీఆర్ఎస్ పేరుతో ఎక్కడికి వెళితే అక్కడికి రావడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.
పార్టీలో టీ అనే అక్షరాన్ని తొలగించడంద్వారా ఏ పార్టీ అయినా స్వేచ్ఛగా రాజకీయం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో చంద్రబాబు ఖమ్మంలో బహిరంగసభ పెట్టి విజయవంతమయ్యారు. రాజకీయ విశ్లేషకులు కూడా కేసీఆర్ ఎక్కడికి వెళితే అక్కడికి టీడీపీ కూడా వస్తుందని, ఎక్కడైతే బీఆర్ఎస్ పోటీచేస్తుందో అక్కడ టీడీపీ కూడా పోటీచేయబోతోందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో టీడీపీకి మంచిరోజులు
తొలి నుంచి ప్రత్యర్థులుగా కత్తులు నూరుకుంటున్న కేసీఆర్, చంద్రబాబు మధ్య రాష్ట్రం విడిపోయిన తర్వాత విభేదాలు మరింత ముదిరాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టుకట్టి కేసీఆర్ ను ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. గెలుపొందిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ 2019 ఏపీ ఎన్నికల్లో జగన్ గెలిచేందుకు సహాయపడ్డారు.
ఇప్పుడు ఆంధ్రుల పార్టీ, సెంటిమెంట్, ప్రత్యేక తెలంగాణ అనడానికి అవకాశం లేకుండా కేసీఆరే చేశారు. దీంతో చంద్రబాబు ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా రాజకీయం చేసుకోగలుగుతున్నారు. బీఆర్ఎస్ ఏపీలోను రాజకీయం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్యాలయ నిర్మాణానికి అవసరమైన పనులను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా ఏపీలోకి వస్తుండగా, చంద్రబాబు అదే తెలుగుదేశం పార్టీతో బలోపేతమయ్యేందుకు కృషిచేస్తున్నారు.
ఇరువురు నేతలమధ్య ఉన్న వైరం కారణంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచిరోజులు వచ్చాయని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీలో కేసీఆర్ ఎంతవరకు విజయవంతమవుతారో చెప్పలేమంటున్నారు.












Click it and Unblock the Notifications