కక్ష, కసి ఉన్నాయి: కెసిఆర్, జగన్లపై బాబు నిప్పులు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నిప్పులు చెరిగారు. మాజీ మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు టిడిపిలో చేరిన సమయంలో ఆయన మాట్లాడారు.
అత్యధిక కాలంగా రాజకీయాల్లో ఉన్న నేతగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా తన పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. సీమాంధ్రను నిర్మించాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ వల్లే రెండు ప్రాంతాల్లో విద్వేషాలు, బేదాభిప్రాయాలు వచ్చాయన్నారు. సీమాంధ్ర, తెలంగాణను కలిపే శక్తి టిడిపికే ఉందన్నారు. రెండు ప్రాంతాల వారు ఇంకొకరికి అన్యాయం జరగాలని కోరుకోలేదన్నారు.

అపాయింటెడ్ డే తర్వాత జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. టిడిపిని దెబ్బతీసేందుకే విభజన తెర పైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. టిడిపిపై ఇప్పుడు చారిత్రాత్మక బాధ్యత ఉందన్నారు. కెసిఆర్, తెరాస తెలంగాణ సెంటిమెంటుతో డబ్బులు దోచారన్నారు. ఇక నుండి దోపిడీ చేస్తే ప్రజలు కొడతారన్నారు. టిడిపి రాజీవ్, ఇందిర, చెన్నారెడ్డి, విజయ భాస్కర రెడ్డి వంటి వారితో పోరాటం చేసిందన్నారు.
తాము ప్రజల కోసం తప్పకుండా పోరాడుతామన్నారు. సీమాంధ్రలో నిర్మాణం బాధ్యత, తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం టిడిపితోనే సాధ్యమన్నారు. తనలో రాష్ట్రాలు బాగు చేయాలని కసి, కక్ష, కోపం, ఆవేదన ఉన్నాయన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తనకు క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పని చేయడం నేర్పారన్నారు. తమవల్లనే తెలంగాణ వచ్చిందని కొందరు గుర్రాలు, ఒంటెలపై ఊరేగారని, ఇప్పుడేమో తమకు చెప్పకుండా ఏర్పాటు చేశారంటున్నారని కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు.
ఈడి అటాచ్ చేసిన ఆస్తుల విలువ చూస్తే రాష్ట్రంలో జరిగిన అవినీతి ఎంతో తెలుస్తుందని వైయస్ జగన్ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందన్నారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసి నిజాయితీ నిరూపించుకుంటానని చెప్పారు. కెసిఆర్ వసూల్ రాజా అని, ఇప్పుడు వసూళ్లకు పాల్పడితే ప్రజలు తిరగబడతారన్నారు. వైయస్ పాలనలో జరిగినంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications