బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి; వీధి రౌడీలా అశోక్ గజపతిపై దాడి: చంద్రబాబు
విజయనగరం రామతీర్థంలో బోడికొండపై కోదండ రామాలయం పునర్నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజుకు తీవ్ర అవమానం జరిగిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అశోక్ గజపతి రాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం తనను కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, ఆపై శిలాఫలకంలో తన పేరు లేదని, అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.
దేవుడి మీద రాజకీయమా.. సర్కస్ కంపెనీ అంటారా? అశోక్ గజపతి రాజుకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్
రామతీర్ధం రామాలయ శంకుస్థాపనలో ఘర్షణ
ఇక ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం పై వైసీపీ నేతలు ఇప్పటికే అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కావాలని అశోక్ గజపతి రాజు రాద్ధాంతం చేశారని, శ్రీ రాములవారి దేవాలయాన్ని వైసీపీ ప్రభుత్వం పునర్నిర్మాణం చేస్తుంటే తట్టుకోలేక గొడవకు దిగారని వైసీపీ మంత్రులు మండిపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారమే ఆయనను పిలిచామని, కావాలని ఆయన హుందా మరచి ప్రవర్తించారని వైసీపీ మంత్రులు విరుచుకుపడ్డారు. రాజకీయ మనుగడ కోసం దేవుడిపై నీచ రాజకీయాలకు దిగారని అసహనం వ్యక్తం చేశారు.
వీధి రౌడీల్లా అశోక్ గజపతిపై వైసీపీ మంత్రులు దాడికి దిగుతారా?
ఇక టిడిపి సీనియర్ నాయకులు, రామతీర్థం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు జరిగిన అవమానంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రామతీర్థం ఆలయం వద్ద జరిగిన ఘటనపై స్పందించిన ఆయన వైసీపీ మంత్రులు వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజు పై దాడికి తెగించారని తీవ్ర విమర్శలు చేశారు. మంత్రుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్త గా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.
వేల ఎకరాలు దానం చేసిన కుటుంబానికి ఇచ్చిన గౌరవం ఇదేనా?
వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అశోక్ గజపతిరాజుపై కక్ష కట్టారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా అవమానాలకు గురి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రామతీర్థంలో మంత్రుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రామతీర్థం రాముడి సాక్షిగా వైసీపీ నేతల అరాచకం బట్టబయలైంది అని చంద్రబాబు విమర్శించారు. దేవాలయాల్లో పాటించవలసిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని చంద్రబాబు ఆరోపించారు.
Recommended Video
ప్రోటోకాల్ పాటించే బుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి లేదా?
కనీసం ప్రోటోకాల్ పాటించాలన్న బుద్ధి కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు లేదంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. గతంలోనూ అశోక్ గజపతి రాజును టార్గెట్ చేస్తూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తొలగించి, ట్రస్ట్ భూములు దోచుకోవాలని కుట్రలు చేశారని మండిపడ్డారు. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరి చిప్పల మంత్రి చిన్నాపెద్దా లేకుండా నోరు పారేసుకుంటున్నారు అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేదో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. భక్తులు ఎవరు విరాళమిచ్చిన తీసుకోవాలని, భక్తులు ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరును, మంత్రుల తీరును ఆక్షేపించారు.