టార్గెట్ 2019: కోటి కుటుంబాల నుండి సమాచారం, సంక్షేమ పథకాలపై బాబు ఆరా
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన పాలనపై ప్రజల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకం ద్వారా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇంకా ఏ పథకాల కోసం ప్రజలు కోరుకొంటున్నారనే విషయమై టిడిపి సమాచారాన్ని సేకరిస్తోంది. ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ప్రజల నుండి నిర్ధిష్టమైన ఫీడ్బ్యాక్ ఆధారంగా పలు మార్పులు చేర్పులు చేసే అవకాశం కన్పిస్తోంది.
ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలను కలుసుకోవాలని టిడిపి ప్లాన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజలు కోరుకొంటున్న అంశాలను తెలుసుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని టిడిపి వినియోగించుకోవాలని భావిస్తోంది.
ప్రజల నుండి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భవిష్యత్లో కొత్త పథకాలు, కార్యక్రమాలకు టిడిపి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ప్రజల నుండి వస్తోన్న సమాచారం ఆధారంగా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులపై అనినీతి ఆరోపణలపై నేరుగా ఫిర్యాదు చేయడానికి టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.
ప్రతి నియోజకర్గానికి సమస్యల లిస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సమస్యలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్యల చిట్టాను తయారు చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది ఆపరేటర్లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి పంపారు. పార్టీ నేతల వెంట ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారం నమోదు చేయడం వీరి పని.
రోజుకు 1.75 లక్షల కుటుంబాల సమాచార సేకరణ
ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా సరాసరిన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రోజుకు 100 ఇళ్ల సమాచారం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ప్రకారం రోజుకు 1.75 లక్షల కుటుంబాల సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంది. జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కోటీ పాతిక లక్షల కుటుంబాలు (4.97 కోట్ల జనాభా) ఉన్నాయి. ప్రతి కుటుంబాన్నీ కలుసుకోవాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నా సమయాభావం వల్ల కోటి కుటుంబాలను మించి కలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.
ప్రతి కుటుంబం మ్యాపింగ్
గత మూడేళ్లుగా టిడిపి అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. జనాభా లెక్కల సేకరణ సమాచారాన్ని తీసుకొని దానిని మొదట గ్రామాలు, వార్డుల వారీగా విడగొట్టారు. తర్వాత జన చైతన్య యాత్రలు, జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా ఏ కుటుంబం ఎక్కడ ఉంటోందన్నది మ్యాపింగ్ చేశారు. తర్వాత ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ఏ గ్రామంలో ఎన్ని కుటుంబాలకు అందుతున్నాయో లెక్కలు తయారు చేశారు.. ఈ వివరాలన్నీ ఇప్పుడు ఇంటింటికీ వెళ్తున్న ఆపరేటర్లకు వారి ట్యాబ్ల్లో నిక్షిప్తం చేసి ఇచ్చారు. పార్టీ నేతలు, ఆపరేటర్లు ఇళ్లకు వెళ్లినప్పుడు.. తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా ఆయా పథకాలు ఆ కుటుంబానికి అందిందీ లేనిదీ అడిగి తెలుసుకుంటున్నారు. తప్పులుంటే సరిచేసుకుంటున్నారు.
ప్రజల స్పందనపై సమాచార సేకరణ
ప్రజల సంతృప్త స్థాయిని కూడా నమోదు చేస్తున్నారు టిడిపి నేతలు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు ఏ రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు సానుకూలమా.. ప్రతికూలమా.. తటస్థమా అనేది కూడా గ్రహించి రికార్డ్ చేస్తున్నారు. దీని ఆధారంగా పథకాలు, కార్యక్రమాలపై మార్పులు చేర్పులు చేయనున్నారు.
సామాజిక, వ్యక్తిగత విషయాలపై ఆరా
ప్రతి కుటుంబానికి ఏ రకమైన ప్రయోజనాలు అందుతున్నాయనే విషయాలపై ఆరా తీయనున్నారు. మరేదైనా పథకం కింద ఆ కుటుంబం ప్రయోజనం పొందిందో లేదో తెలుసుకుని ఈ సమాచార నిధిలో చేరుస్తున్నారు. ఆ కుటుంబానికి ఇంకా అవసరాలేమైనా ఉన్నాయా... ప్రభుత్వం నుంచి మరేదైనా సాయం ఆశిస్తున్నారా అన్నదీ అడిగి తెలుసుకుంటున్నారు. ఈ అవసరాలను వ్యక్తిగతం.. సామాజికం అన్న రెండు విభాగాల కింద విభజిస్తున్నారు. పింఛను, రేషన్ కార్డు, ఇల్లు వంటివి కోరుతుంటే అవి వ్యక్తిగతమని.. తమ నివాస ప్రాంతానికి రోడ్డు, మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు వంటివి కోరుతుంటే సామాజిక సమస్యగా వర్ణిస్తున్నారు.