అర్థం చేసుకుని మాట్లాడారు: పవన్ కళ్యాణ్పై బాబు ఖుషీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూముల సేకరణ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుని మాట్లాడారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నవ్యాంధ్ర రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారని, నిజానికి రాజధానికి మిగిలేది 7 వేల ఎకరాలు మాత్రమేనని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, గ్రీన్ బెల్ట్, విద్యాలయాలు, ఆస్పత్రులు వంటి సామాజిక అవసరాలకు సగం భూమి పోతుందని, రాజధానిలో రోడ్లను కూడా విశాలంగా నాలుగు లైన్లు, ఆరు లైన్లతో వేస్తున్నామని, ఇక, రైతులకు వారి వాటా కింద ఇచ్చే భూమి పోగా ప్రభుత్వానికి సరిగ్గా 7240 ఎకరాలు మిగులుతుందని ఆయన అన్నారు.
రాజధానికి ఎంత సరిపోతుందని అందరూ చెబుతున్నారో అంతే మిగులుతోందని చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం తన నివాసంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాజధానికి భూ సమీకరణపై వస్తున్న విమర్శల ప్రస్తావన వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం ఐదు వేల ఎకరాల్లో విస్తరించి ఉందని, ఆ మాత్రం కూడా కొత్త రాజధానికి ఉండవద్దా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

కొత్త రాజధాని కేవలం నాలుగు భవనాలు కాకుండా అది ఉపాధి అవకాశాలను సృష్టించేదిగా ఉండాలని తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నవ్యాంధ్రకు సంబంధించి చాలా ఆలోచనలు పెట్టుకొని పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలోని అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. భూసమీకరణ విజయవంతంగా జరిగిన తీరును ఆయన కూడా అర్థం చేసుకొని మాట్లాడినట్లు అనిపించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం, సేకరించిన భూమిలో 20 శాతం రైతులకు ఇవ్వాల్సి ఉందని, కానీ, ఇక్కడ 25 శాతం వరకూ ఇస్తున్నామని ఆయన తెలిపారు. రాషా్ట్రనికి సాయం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంపైగానీ, బీజేపీపైగానీ విమర్శలకు దిగవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రూ.42 వేల కోట్ల వరకూ ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు వ్యయం అవుతోందని, వివిధ రకాల ఖర్చులు పోను అభివృద్ధి పనులకు తక్కువే మిగులుతోందని వివరించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్ష నేత జగన్ విమర్శలను ఆయన కొట్టివేశారు. త్వరలోనే విడతలవారీగా డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తామని, రైతు రుణ మాఫీ రెండో దశను కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications