'త్వరలోనే చంద్రబాబు అరెస్టవుతారు.. అది తెలిసే ఆయన ఇలా!..'
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు త్వరలోనే అరెస్టవుతారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ జోస్యం చెప్పారు.
చెన్నై: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు త్వరలోనే అరెస్టవుతారని జోస్యం చెప్పారు.
అరెస్టు విషయం చంద్రబాబుకు కూడా తెలుసని, ఆ విషయం తెలిసే చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టకుండా విజయవాడకే పరిమితమయ్యారని మర్రి రాజశేఖర్ విమర్శించారు. శుక్రవారం మాచర్లలో జరిగిన వైసీపీ నేత వెన్నా వెంకటరెడ్డి కుమారుడు సుదర్శనరెడ్డి వివాహానికి హాజరైన ఆయన వివాహానంతరం మీడియాతో మాట్లాడారు.
కేంద్రం అండతో ప్రస్తుతానికి అరెస్టు నుంచి తప్పించుకున్నా ఎక్కువ రోజులు అలా తప్పించుకోలేరని అన్నారు. పనిలో పనిగా వైసీపీ అధినేతపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. జగన్ కేసులకు భయపడే రకం కాదని అన్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైతం సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పెదబాబు, చినబాబు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు.
కాగా, ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కొనుగోలుకు తెరలేపారన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి.
అయితే కేసు లోగుట్టు మాత్రం ఎవరికి ఒక పట్టాన అంతుపట్టలేదు. అప్పటిదాకా ఢీ అంటే ఢీ అన్న తరహాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇద్దరి వైఖరిలోను స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది. మొత్తం మీద కేసు కూడా అంతే మరుగునపడిపోయింది.